ఆదర్శం ------------------>>>>>>>>>> చెత్త నుంచి కొత్త పరిమళాలు!

చెత్త నుంచి కొత్త  పరిమళాలు!
అదో సుందర ఉద్యానవనం..
పచ్చికతో కనువిందు చేసే పరిసరాలు..
మల్లెపూల పరిమళాలు..
ఎటు చూసినా అందమైన సీతాకోక చిలుకలు...
హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న వాకర్లు...
ఇదంతా అద్భుతంగా తీర్చిదిద్దిన పార్కులోని విశేషాలు కావు...
ఓ డంపింగ్‌ యార్డులోని దృశ్యాలు...
అవునండీ...
అంత దూరంలో ఉండగానే...
ముక్కుమూసుకుని, తలతిప్పుకుని వెళ్లిపోయే పరిస్థితి నుంచి అక్కడకెళ్లి కాసేపైనా గడిపి రావాలనిపించే ఆహ్లాదకర వాతావరణం ఆ డంపింగ్‌ యార్డు సొంతం. హైదరాబాద్‌ నగర శివారులోని బోడుప్పల్‌లో ఉందిది. చెత్తతో నిండి... తీవ్రమైన దుర్గంధంతో సతమతమయ్యే స్థితి నుంచి పదిమందినీ ఆకర్షించేలా ఆ కేంద్రం మారడం వెనక ఓ  కృత నిశ్చయముంది. ఏడాదిపాటు జరిగిన అవిశ్రాంత కృషి ఉంది.
1 బోడుప్పల్‌  2016 ఏప్రిల్‌లో మున్సిపాలిటీ అయింది. అప్పటివరకు గ్రామ పంచాయతీగా ఉండడంతో స్థానికంగా ఉత్పత్తయ్యే చెత్తంతా తీసుకెళ్లి కిలోమీటరు దూరంలో ఉన్న డంప్‌యార్డులో పారబోసేవారు. కార్మికులు తమకు కావాల్సిన ఇనుము, ప్లాస్టిక్‌ వ్యర్థాలు అమ్ముకోవడానికి ఏరుకుని.. మిగిలిన చెత్తను అక్కడే తగలబెట్టేవారు. ఆ వ్యర్థాలు కుళ్లిపోయి తీవ్రమైన దుర్గంధం వ్యాపించేది. ఇక చెత్త తగలబెట్టినప్పుడు అటుగా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉండేది. సమీపంలోని 30 కాలనీల ప్రజలతో పాటు మల్లాపూర్‌ పారిశ్రామికవాడకు వెళ్లే వందలాది మంది కార్మికులు డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్గంధం, కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. బోడుప్పల్‌ మున్సిపాలిటీగా మారాక కమిషనర్‌గా ఆర్‌.ఉపేందర్‌రెడ్డి వచ్చారు. ఈ డంపింగ్‌ యార్డు సమస్య ఆయన దృష్టికి రావడంతో ఓ సత్సంకల్పానికి బీజం పడింది.
2 డంపింగ్‌ యార్డు తరలించడం అంటే చిన్న విషయమేమీ కాదు. అందుకు అనువైన స్థలం దొరకాలి.. స్థానికులూ ఒప్పుకోవాలి. అసలే పట్టణీకరణ కారణంగా స్థలాల కొరత తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని ఉపేందర్‌రెడ్డి భావించారు. డంపింగ్‌ యార్డు నుంచి దుర్వాసన, కాలుష్యం రాకుండా తగిన చర్యలు తీసుకుంటానని కొన్నాళ్లు ఓపిక పట్టాలని స్థానికులకు సూచించారు. ముందు డంపింగ్‌ యార్డు నుంచి కాలుష్యపొగలు రాకుండా వ్యర్థాలకు నిప్పుపెట్టకుండా కార్మికులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ఆరు నెలలపాటు కమిషనర్‌, పారిశుద్ధ్య విభాగం అధికారులు రేయింబవళ్లు శ్రమించారు. కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి అయితే ఉదయం కార్యాలయ విధులు చూసుకుని మధ్యాహ్నం నుంచి డంప్‌యార్డులో జరుగుతున్న పనులు పర్యవేక్షించేశారు. ఇక దుర్వాసన రాకుండా చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
3 వ్యర్థాల సమగ్ర నిర్వహణతో పాటు చుట్టూ పచ్చదనం పరుచుకునేలా చేయగలిగితే దుర్వాసన అడ్డుకోవచ్చని భావించారు. ముందుగా నాలుగున్నర ఎకరాలు ఉన్న యార్డు చుట్టూ  రూ.10లక్షల ఖర్చుతో కంచె వేయించారు. యార్డులోపల అడ్డదిడ్డంగా ఉన్న గుట్టలను బాగు చేసి ఓ అందమైన రూపు తీసుకొచ్చారు. కంచె చుట్టూ పుష్పించే తీగజాతి మొక్కలు నాటించారు.దుర్వాసన గ్రహించే మొక్కలు వేశారు. మిగిలిన డంపింగ్‌ యార్డు ప్రాంతాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. గులాబీ వనం, మల్లె వనం, ఔషధవనం, తులసీవనం, సుగంధవనం.. ఇలా ఆయా ఒక్కో భాగాన్ని ఒక్కో వనంగా అభివృద్ధి చేశారు. పారిజాతం మొక్కలు, గన్నేరు, మల్లె, సన్నజాజి, విరజాజి, గులాబీ, సంపంగి, గోవర్ధనం తదితర పూల మొక్కలతోపాటు పండ్లజాతి మొక్కలు, లెమన్‌గ్రాస్‌ వంటివీ పెట్టారు. 250 మొక్కలను యార్డులో నాటారు. దీంతో అందమైన సీతకోకచిలుకలు అక్కడ చేరి చూపరులను కనువిందు చేస్తున్నాయి.
4 బోడుప్పల్‌ మున్సిపాలిటీలో నెలకు సుమారు 1800 నుంచి 2000 వేల టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. వీటి నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. తడి, పొడి చెత్త నిర్వహణపై కార్మికులకు అవగాహన కల్పించారు. ఆటోల్లో తీసుకువచ్చిన తడి చెత్తను కార్మికులు అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బెడ్‌లపై ఆరబెడతారు. అలా ఎండిన వ్యర్థాలను పొడిలా చేసి వానపాములతో వర్మికంపోస్టు తయారు చేస్తున్నారు. ఇలా వచ్చిన వర్మి కంపోస్టును డంపింగ్‌ యార్డులో ఉన్న వేలాది మొక్కలతోపాటు మున్సిపల్‌ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు ఎరువుగా వేస్తుంటారు. మిగిలిన వర్మి కంపోస్టు ఎరువును కేజీ రూ.10 చొప్పున స్థానికులకు విక్రయిస్తున్నారు. ఇలా నెలకు 1300-1500 కేజీల వర్మి కంపోస్టును ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు.
5 క పొడి చెత్తలో భాగంగా వచ్చే ప్లాస్టిక్‌, అట్టముక్కల నిర్వహణకు డీఆర్‌సీ (డ్రై రీసోర్స్‌ కలెక్షన్‌) కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు స్థానిక యువతకు ఉపాధి కల్పించారు. ఆ యువకులు ప్లాస్టిక్‌, అట్టముక్కలను బెయిలింగ్‌ యంత్రంలో ఉంచి వత్తి.. వాటిని అమ్ముతారు. మెటల్స్‌, అధిక మందం కలిగిన ప్లాస్టిక్‌, తక్కువ మందం కలిగిన ప్లాసిక్‌, కాగితపు అట్టలు.. ఇలా వేర్వేరు విభాగాలుగా వీటిని విక్రయిస్తారు. ఇంకా చెత్త మిగిలిం ఉంటే జవహర్‌నగర్‌ డంప్‌ యార్డుకు ఏ రోజుకారోజు పంపించేస్తుంటారు. వర్మికంపోస్టు, పాస్టిక్‌ విభజన కోసం దాతల సహకారంతో భారీ షెడ్డును నిర్మించారు.
6 నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు భారీ ఇంకుడుగుంత ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసినా చుట్టూ పూల మొక్కలతో ఆహ్లాదకర వాతావరణ ఏర్పడి దుర్వాసన స్థానంలో పూల నుంచి వచ్చే సుగంధం వస్తోంది. డంపింగ్‌ యార్డు అన్న సంగతి మరిచిపోయి ఉదయం, సాయంత్రం స్థానికులు వాకింగ్‌ చేస్తున్నారు. మొక్కలు, పచ్చికబయళ్ల మధ్య సేద తీరుతున్నారు. గతంలో ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి నుంచి ఇప్పుడా ఉద్యానవనాన్ని చూడ్డానికి జనం వస్తున్నారు. సాయంత్రం  అక్కడ ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ దీపాల వెలుగుల్లో పచ్చదనంపై పడి ఎంతో సుందరంగా కనిపిస్తుంటుంది.
7 తేడాది ఏప్రిల్‌ నుంచి నవీకరించిన డంపింగ్‌ యార్డును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏటా తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రభుత్వ సంస్థలు నిర్వహించే ఉద్యానవనాలకు ఉత్తమ కేటగిరీలో అవార్డులు ఇస్తుంటుంది. 2018 సంవత్సరానికి బోడుప్పల్‌ డంపింగ్‌ యార్డు ఆ అవార్డును కైవసం చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఎందరో డంపింగ్‌ యార్డును సందర్శించి ప్రశంసించారు. రాజస్థాన్‌లోని పంచకుల మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణలోని 30 మున్సిపాలిటీల కౌన్సిలర్లు ఇప్పటివరకూ దీన్ని సందర్శించారు. వీరికి ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే డంపింగ్‌ యార్డు నిర్వహణ బాధ్యత ఎంతో కీలకంగా మారింది. యార్డుతోపాటు పట్టణమంతా ఉన్న పచ్చదనం నిర్వహణకు టెండర్‌ ద్వారా రూ.9లక్షలకు ప్రైవేటు సంస్థకు అప్పగించారు.
‘‘డంపింగ్‌ యార్డులు అంటే కాలుష్యానికి, దుర్గంధానికి నెలవు అన్న భావన నుంచి ఓ ఉద్యానవనంగా మార్చగలిగాం. ఇందుకు నెలల తరబడి నేను, మిగిలిన అధికారులు, కార్మికులు ఎంతో శ్రమించాం. 30కాలనీల ప్రజలకు సమస్య నుంచి విముక్తి కల్పించాం. అలాగే వందశాతం చెత్త విభజన జరిగేలా చూసి జవహర్‌నగర్‌ కూడా తరలించకుండా ఏర్పాటు చేయబోతున్నాం’’
- ఆర్‌.ఉపేందర్‌రెడ్డి
- అమరేంద్ర యార్లగడ్డ,  ఫొటోలు: బషీర్‌.

Reference:                                      http://www.eenadu.net/special-pages/vahrehvah/vahrehvah-inner.aspx?featurefullstory=24807                                                                                   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)