అలల పోటులో.. చెదరని కోట

అలల పోటులో.. చెదరని కోట
 చుట్టూ సముద్రం.. మధ్యలో నలభై అడుగుల ఎత్తున్న రాతి గోడలు. ఆ గోడల వెనుక.. రాచరిక వైభవం! మూడున్నర శతాబ్దాలు దాటుతోన్నా తరగని సౌందర్యం! కట్టుబానిసలుగా మన దేశానికి వచ్చినవారి పట్టుదలకు నిదర్శనం.. మహారాష్ట్రలోని జంజీరా కోట!! 22 ఎకరాల్లో.. 22 సంవత్సరాల్లో..  22 బురుజులతో.. కట్టిన అరుదైన నిర్మాణం ఇది. కొంకణ తీరంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన సిద్దీల రాజధానిగా వెలుగొందింది. ఎందరో రాజుల దాడులను తట్టుకొని.. శత్రు దుర్భేద్యమైన దుర్గంగా పేరొందింది. శతాబ్దాలుగా సముద్ర అలలు దాడి చేస్తున్నా.. అంతే అందంగా, అంతే దర్జాగా కనువిందు చేస్తోంది.
రబిక్‌ కడలి అంచున ఉన్న చారిత్రక ప్రదేశాల్లో మురుద్‌ ఒకటి. ఆ పట్టణంలో ఒక అందమైన రాజ భవనం ఉంది. చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. ప్రధాన ద్వారానికి భారీ ఇనుప గేట్లు ఉంటాయి. ఆ పక్కనే ‘అనుమతి లేకుండా ప్రవేశం లేదు’ అని ఒక సూచిక వేలాడుతూ ఉంటుంది. ఊరి నడి బొడ్డున ఉన్న నవాబుల వారసుల భవనమది. కానీ, నగరంలో ఉన్న ఈ మహల్‌ను చూసేందుకు అనుమతి తీసుకోవాలి. అందుకే కాబోలు అక్కడికి ఎవరూ వెళ్లరు. ఇక్కడికి సమీపంలో వీరి తాతముత్తాతలు పాలించిన కోట ఉంది. నడి సముద్రంలో ఉన్నా... దానిని చూసేందుకు అలల ఆటుపోట్లకు వెరవకుండా నాటు పడవల్లో తండోపతండాలుగా వెళ్తుంటారు.
ఒకప్పుడు జంజీరా కోటలో పాగా వేయాలని పోర్చుగీసువారు ప్రయత్నించారు. కుదరలేదు. ఇదే కోటలో కాలుమోపాలని మరాఠా యోధులు యుద్ధాలు చేశారు. వారికీ సాధ్యపడలేదు. ఇప్పుడు ఓ యాభై రూపాయల టికెట్‌ కొంటే చాలు ఎవరైనా.. ఈ కోటలో రాజులా విహరించవచ్చు! అక్కడి వింతలు చూసి, విశేషాలు తెలుసుకొని ఆశ్చర్యపోవచ్చు. మురుద్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజ్‌పురి గ్రామం. అక్కడి నుంచి జంజీరా కోటకు వెళ్లాలంటే సముద్రంపై ప్రయాణం చేయాలి. మరబోట్లు, నాటు పడవల్లో ప్రయాణంతో అందమైన విహారం మొదలవుతుంది.
ఘనమైన చరిత్ర
రాజ్‌పురి తీరం నుంచి సముద్రంలో సుమారు కిలోమీటర్‌ ప్రయాణిస్తే జంజీరా కోట ప్రధాన ద్వారం వస్తుంది. నలభై అడుగుల కోట గోడ. పాతిక అడుగులకు మించిన లోహ ద్వారం. ఆ కోటలోకి అడుగుపెట్టగానే.. ముందుగా అందరి కళ్లు పడేది.. గోడపై చెక్కిన ఒక శిలాఫలకంపైనే! ఒకే ఒక్క పులి.. ఆరు ఏనుగులను వేటాడుతున్నట్టు ఉంటుంది. ఆ కోటను ఏలినవారు ఎంతటి ధీశాలురో చెప్పకనే చెబుతుందా చెక్కడం. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్దీ జాతికి చెందిన వారు వేలాదిగా భారతదేశానికి వలస వచ్చారు. వీరిలో కట్టుబానిసలు కూడా ఉన్నారు. వారే తర్వాతి కాలంలో కొంకణ్‌ ప్రాంతంలో చక్రం తిప్పారు. రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. నమ్మకానికి, వీరత్వానికి ప్రతీక వీళ్లు. అందుకే అహ్మద్‌నగర్‌ను పాలిస్తున్న నిజాంషాహీ ప్రభువు సిద్దీలను స్వయం ప్రతిపత్తి కలిగిన రాజులుగా గుర్తించాడు. అలా 17వ శతాబ్దం ప్రారంభంలో జంజీరా ప్రాంతానికి సిద్దీ మాలిక్‌ అంబర్‌ కొన్నాళ్లు ప్రధానిగా ఉన్నాడు. ఆయన హయాంలోనే కోట నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత సిద్దీ సురల్‌ ఖాన్‌ రాజుగా ఉన్నప్పుడు కోట నిర్మాణం పూర్తయింది. కాలక్రమంలో ఈ కోటపై ఎందరి కళ్లో పడ్డాయి. దాడులకు దిగారు. యుద్ధాలు చేశారు. కోట నీడను కూడా తాకలేకపోయారు. భారత స్వాతంత్య్రం వచ్చే వరకు జంజీరా స్వతంత్ర రాజ్యంగానే ఉంది. 1948లో భారత్‌లో విలీనమైంది.
ఫిరంగుల మోత
కోట చరిత్ర ఎంత గొప్పదో.. కోట లోపల వింతలూ అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాజ ప్రాసాదాలు, దర్బార్‌ హాల్‌, రాణివాసం, ధాన్యాగారం ఇలా ఎన్నో! 22 ఎకరాల్లో దీర్ఘవృత్తాకారంగా ఉన్న ఈ కోట చుట్టూ 22 బురుజులు ఉన్నాయి. కోటపై 557 ఫిరంగులు ఉండేవి. కోటపై ఏ దిక్కు నుంచి శత్రువుల కన్ను పడినా.. ఫిరంగుల మోత మోగేది. ప్రస్తుతం ఈ ఫిరంగుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వీటిలో కలాల్‌ బాంగ్‌డీ ఫిరంగి ప్రత్యేకమైనది. మన దేశంలోనే రెండో అతిపెద్ద ఫిరంగిగా పేరున్న దీని పొడవు 18 అడుగులు. బరువు విషయానికి వస్తే 20 టన్నుల పైమాటే!
ఎన్నో విశేషాలు..
1970 వరకు కొన్ని కుటుంబాలు కోటలోనే నివసించేవి. మంచి నీళ్ల బావి ఈ కుటుంబాల తాగునీటి అవసరాలు తీర్చేది. ఇప్పటికీ ఇక్కడ మంచినీళ్ల బావిలో నీళ్లు అంతే తియ్యగా, స్వచ్ఛంగా ఉన్నాయి. సముద్రం మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలో మంచి నీళ్ల బావి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సమీపంలోనే అంతఃపుర కాంతల స్నానాల కోసం నిర్మించిన కొలను ఉంటుంది. కోటలో ప్రత్యేక ఆకర్షణ సురల్‌ ఖాన్‌ ప్యాలెస్‌. ఏడు అంతస్తులుగా నిర్మించిన ఈ ప్రాసాదం కాలపరీక్షను ఎదుర్కొంటోంది. పైమూడు అంతస్తులు కూలిపోయి.. నాలుగు అంతస్తులే మిగిలాయి. అయినా మహల్‌ ఠీవీ ఎంత మాత్రం తగ్గలేదు. మంచి నీళ్ల బావి ఎదురుగా ఉండే మసీదు, సీస్‌ మహల్‌ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కోట గోడల నిర్మాణంలో రాళ్ల మధ్య.. పాదరసం, సీసం, బెల్లం మిశ్రమం వినియోగించారట అందుకే శతాబ్దాలుగా కడలి కెరటాలు దాడి చేస్తున్నా.. కోట గోడలు బీటలు వారింది లేదు. జంజీరా కోటలో విహరిస్తున్నంత సేపు ఏదో సాహస యాత్ర చేస్తున్న అనుభూతి కలుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో సముద్రంలో ఇలాంటి నిర్మాణం ఎలా కట్టారో అనిపిస్తుంది. సూర్యాస్తమయ వేళ మరింత అందంగా కనిపించే కోటను చూస్తూ.. పర్యాటకులంతా పడవల్లో తిరుగు ప్రయాణం అవుతారు.
ఏడాదంతా అనుకూలం
 ఏడాదంతా జంజీరా కోటను సందర్శించవచ్చు. వేసవి విడిది కోసం లోనావాలా, ఖండాలా వెళ్లే పర్యాటకులు పనిలో పనిగా జంజీరా కోట చుట్టేసి వస్తుంటారు.
విహారానికి అనుకూలంగా ఉండే నవంబర్‌-ఫిబ్రవరి మధ్య జంజీరాకు పర్యాటకుల తాకిడి ఎక్కువ.
ఎలా వెళ్లాలంటే
జంజీరా కోట ముంబయి నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే స్టేట్‌ హైవే-92 మీదుగా వెళ్తే జంజీరా చేరుకోవచ్చు. బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు ఉంటాయి.
పుణె నుంచి 182 కిలోమీటర్లు, రాయ్‌గఢ్‌ నుంచి 85 కిలోమీటర్లు ఉంటుంది. ప్రముఖ పర్యాటక కేంద్రం లోనావాలా నుంచి మురుద్‌కు దూరం 117 కిలోమీటర్లు. రాయ్‌గఢ్‌, పుణె నుంచి మురుద్‌కు బస్సులు అందుబాటులో ఉన్నాయి.
సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి పుణె వరకు రైలులో వెళ్లాలి. అక్కడి నుంచి బస్సులో మురుద్‌-జంజీరా చేరుకోవచ్చు.
ఇక్కడ ఉండొచ్చు..
మురుద్‌లో గోల్డెన్‌ స్వాన్‌ బీచ్‌ రిసార్ట్‌ అందంగా ఉంటుంది. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే గదుల అద్దె కూడా పెరుగుతుంది.
సాండ్‌ పైపర్‌ రిసార్ట్స్‌, షోర్‌లైన్‌ రిసార్ట్స్‌, సీషెల్‌ రిసార్ట్స్‌లో ఆతిథ్యం బాగానే ఉంటుంది.
గది అద్దె: రూ.3,000 నుంచి రూ.12,000

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)