ఈ శాస్త్రవేత్తలు పక్కా లోకల్‌!

ఈ శాస్త్రవేత్తలు పక్కా లోకల్‌!
అనగనగా ఒక కాకి. దానికి దాహం వేసింది. వెదగ్గా వెదగ్గా ఓ కుండలో అడుగున కొద్దిగా నీరు కన్పించింది. కానీ అడుగున ఉన్న ఆ నీరు పైకి వచ్చేదెలా, తాగడమెలా? కాసేపు ఆలోచించిన కాకి దూరంగా ఉన్న గులక రాళ్లను ఒక్కోటిగా తెచ్చి కుండలో వేసింది. కాసేపటికి నీరు పైకి వచ్చింది. కాకి దాహం తీరింది. ఇది పాత కథ. అంత కష్టమెందుకు, సింపుల్‌గా స్ట్రా తెచ్చుకుని తాగెయ్యుచ్చుగా అంటుంది ఈ తరం. పాతదైనా కొత్తదైనా ఈ కథ... ఎందరో పల్లెటూరి శాస్త్రవేత్తలకు ప్రేరణ. అవసరం ఆలోచింపజేస్తుందనీ, ఆలోచన సరికొత్త ఆవిష్కరణకి దారిచూపుతుందనీ నిరూపిస్తున్నారు ఈ చదువులేని శాస్త్రవేత్తలు.
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. పల్లె బిడ్డలు పట్టణానికి వెళ్లినా పల్లె కష్టాలని మరవరు. సమస్య ఉన్న చోటే పక్కాలోకల్‌ పరిష్కారమూ ఉంటుందని నమ్ముతారు. అందుకే చదివింది వానాకాలపు చదువులే అయినా, అందుబాటులో ఉన్న పరికరాలనే అవసరానికి తగ్గట్టు మలచుకుంటూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. కఠినమైన సమస్యలకీ కత్తిలాంటి సమాధానాలు కనిపెడుతున్నారు. ఏళ్ల తరబడి తాము కష్టపడినా తోటివారి అవసరాలు తీరుస్తున్నారు. అవార్డులూ అందుకుంటున్నారు.
అమ్మకోసం... ఆ రిమోట్‌!
బొమ్మగాని మల్లేశం పేదింటి బిడ్డ. పదో తరగతిలోనే పని బాట పట్టాడు. అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మకోసం అతడిలో మొదలైన ఆలోచన 15 కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసింది. 20 అవార్డులూ పలు పేటెంట్లూ పొంది, సొంత కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగేలా చేసింది. మల్లేశానికి సొంత పొలం లేదు. అయినా అతడి ఆవిష్కరణలన్నీ వ్యవసాయం చుట్టూనే తిరుగుతాయి. పల్లెటూళ్లో రైతుల్నీ వారి కష్టాల్నీ చూస్తూ పెరిగాననీ దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాలు తీర్చాలన్న ఆశే వారికోసం కొత్త వస్తువులు తయారుచేయిస్తోందనీ అంటాడు మల్లేశం.
తండ్రీకొడుకులు పొద్దున్నే పనులకు వెళ్తే మళ్లీ రాత్రికే ఇంటికి వచ్చేవారు. తాము వచ్చి లైటు వేసేదాకా మంచంమీద తల్లి చీకట్లో ఉండడం అతడిని బాధించింది. అప్పటికే విద్యుత్తు పరికరాల మరమ్మతు దుకాణంలో పనిచేస్తున్నాడు మల్లేశం. తాను నేర్చిన పరిజ్ఞానంతో ప్రయోగాలు చేసి ఫ్యాను, లైట్లకు రిమోట్‌ తయారుచేశాడు. దాన్ని తల్లి చేతికిచ్చి లైట్‌ వేయించినప్పుడు ఆమె మొహంలో కన్పించిన ఆనందం మర్చిపోలేనంటాడు మల్లేశం. అప్పుడతని వయసు పదిహేనేళ్లు. మల్లేశం తయారుచేసిన రిమోట్‌ చూసి చాలామంది అలాంటివి తయారుచేసివ్వమని అడిగారు. అప్పటినుంచి చుట్టుపక్కల వారి అవసరాలను నిశితంగా పరిశీలించడం అలవాటైంది అతనికి. రిమోట్‌లు తయారుచేస్తూ వచ్చే డబ్బుతో ప్రయోగాలను కొనసాగించాడు. డీజిల్‌ లేదా పెట్రోలుతో పనిచేసే స్ప్రేయర్లు వాడుతున్న రైతుల ఖర్చు తగ్గించడానికి సూర్యరశ్మితో పనిచేసే స్ప్రేయర్ని తయారుచేశాడు. కరెంటు లేనప్పుడు ఇన్వర్టరుగానూ పనిచేస్తుందిది. కలుపు తీయడానికీ, విత్తనాలు నాటడానికీ, నీటి మోటార్లను మొబైల్‌తో నియంత్రించడానికీ... ఇలా పలు పరికరాలు తయారుచేశాడు. వస్తువు ప్రయోజనం ఏమిటో దాని పనితీరు ఎలా ఉండాలో తెలిస్తే దానికి రూపకల్పన చేయడం కష్టం కాదంటాడతను. మల్లేశం తయారుచేసిన ఓ పరికరం బిగిస్తే డ్రైవరు తాగి వస్తే ఆ వాహనం స్టార్ట్‌ అవదు. ఇలాంటి కొన్ని వస్తువులకు పేటెంట్లు రావాల్సి ఉంది. అవార్డుల ద్వారా వచ్చిన డబ్బుతోనూ, పల్లెసృజన లాంటి సంస్థల ప్రోత్సాహంతోనూ మల్లేశం తన ఆవిష్కరణల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు.
నాటి రిక్షావాలా... నేటి మార్గదర్శి
పాతికేళ్ల వయసులో దిల్లీలో రిక్షా తొక్కుతున్నప్పుడు లీలామాత్రంగానైనా ఊహించలేదు అతడు తానో రైతునీ, ఆవిష్కర్తనీ అవుతానని. దశాబ్దం తిరిగేసరికల్లా ధరమ్‌వీర్‌ అలా ఎలా అయ్యాడంటే... ఉన్నది రెండెకరాల పొలం. తల్లి మరణంతో చదువు అటకెక్కింది. కొంతకాలం తండ్రికి సాయంగా ఉన్న ధరమ్‌వీర్‌ భార్యాబిడ్డల్ని హరియాణాలోని ఊళ్లోనే వదిలి దిల్లీ బయల్దేరాడు. రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో పిల్లల్ని చదివించాలనుకున్నాడు. రెండేళ్లు కష్టపడ్డాడు. ఔషధ మొక్కల ఉత్పత్తులకి అక్కడి మార్కెట్లో లభిస్తున్న ప్రాధాన్యం అతడిని ఆశ్చర్యపరిచింది. ఆ మొక్కలు తమ ఊళ్లో విచ్చలవిడిగా పెరగడం అతనికి తెలుసు. ఇంతలో రోడ్డుప్రమాదం. ఏడాది పాటు మనిషి మంచం మీదే. మనసు మాత్రం గతాన్నీ వర్తమానాన్నీ పెనవేస్తూ పెద్ద ఆలోచనలే చేసింది. కోలుకోగానే ఉన్న ఆ కొంచెం పొలంలోనే కలబంద, ఉసిరి, పుట్టగొడుగులు పండించాడు. ఇక ఇప్పుడు వాటితో రకరకాల ఉత్పత్తులు తయారుచేయాలి. కలబంద రసం తీసే మిషన్‌ కొందామని వెళ్తే కమిషన్‌ 5 లక్షలు అడిగారొకరు. దాంతో ఆ యంత్రాన్ని తానే తయారుచేయాలనుకున్నాడు ధరమ్‌వీర్‌. కొన్ని పరిశ్రమలను చూసివచ్చాడు. ఆ అవగాహనకి తన తెలివితేటలు జోడించి రెండేళ్లు కష్టపడి నమూనా యంత్రాన్ని తయారుచేశాడు. దానిమీద ప్రయోగాలు చేస్తూ మరింతగా అభివృద్ధి చేసి మొత్తానికి మల్ట్టీపర్పస్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మెషీన్‌ని తయారుచేసేశాడు. ఉష్ణోగ్రతల్ని వేర్వేరు స్థాయుల్లో నియంత్రించడం ద్వారా ఆ మెషీన్‌తో ఔషధ మొక్కల ఆకుల నుంచి రసం, జెల్‌, పొడి... ఇలా ఏది కావాలంటే అది తయారుచేయొచ్చు. అప్పటివరకూ ఉన్నవాటికన్నా మెరుగైన యంత్రాన్ని తయారుచేసినందుకు అతడికి జాతీయ అవార్డు లభించింది. దానికి పేటెంటు తీసుకుని వ్యాపారవేత్తగా మారినా ధరమ్‌వీర్‌ తన రెండెకరాల పొలంలో పంటలు పండించడం మాత్రం మానలేదు. ప్రయోగాలు చేస్తున్న అతడిని ఒకప్పుడు పిచ్చివాడని వెక్కిరించిన గ్రామస్థులకు ఇప్పుడు అతడే మార్గదర్శి.
చింతచెట్టు ఎంత పని చేసింది!
చదువుకోవడమంటే అబ్దుల్‌ ఖాదర్‌కి చాలా ఇష్టం. కానీ తండ్రి అతడిని చదువు మానేసి వ్యవసాయం చూసుకోమన్నాడు. అయిష్టంగానే సేద్యం మొదలెట్టిన ఖాదర్‌ ఇప్పుడో వ్యవసాయ పరికరాల వ్యాపారానికి అధిపతి. ఆ పరికరాలన్నీ స్వయంగా అతడు రూపొందించినవే!
కర్ణాటకలోని ధార్‌వాడ్‌లో ఓ పల్లె అతనిది. పేరుకి అరవై ఎకరాల మెట్ట. తండ్రి ఇచ్చిన డబ్బుతో ఉత్సాహంగా డజను బోర్లు వేయించాడు ఖాదర్‌. ఒక్క దాంట్లోనే నీళ్లు పడ్డాయి. పెట్టిన ఖర్చంతా వృథా. అప్పుడు ఆలోచన మొదలైంది. తర్వాత ఏడాది పొలంలోనే చిన్న చిన్న కుంటలు తవ్వి వాన నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేశాడు. మామిడీ, జామా, సపోటా, చింత లాంటి పండ్లమొక్కలు నాటాడు. మరుసటి ఏడాదీ వానల్లేక విపరీతమైన కరువు. చివరికి ఒక్క చింత తప్ప మరే చెట్లూ పెరగలేదు. ఎక్కడెక్కడినుంచో నీరు తెచ్చి కష్టపడి వాటినైనా కాపాడుకోగలిగాడు. ఆ కరవు సమయంలో చింత పండించడమే గొప్పని ఊరంతా అతడిని ప్రశంసించింది. చెట్లనిండా కాసిన చింతకాయలు అతడిలోని ఆవిష్కర్తను తట్టిలేపాయి. చిన్నప్పుడు అలారం మోగినా నిద్ర లేవడంలేదని తండ్రి తిడుతోంటే ఖాదర్‌ ఒక ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు. అలారం మోగినపుడు సీసా వంగి నీరు అతని ముఖంపై పడేలా గడియారానికి నీటిసీసాని అనుసంధానించాడు. అది చూసి తండ్రి నవ్వుకున్నాడే కానీ కొడుకుని చదివిస్తే గొప్ప శాస్త్రవేత్త కాగలడేమోనన్న ఆలోచన రాలేదు. ఆ సంఘటన గుర్తొచ్చిన ఖాదర్‌ మళ్లీ బుర్రకి పనిచెప్పాడు. చింతకాయలన్నీ అప్పటికప్పుడు అమ్మేస్తే గిట్టుబాటు కాదు. అందుకని రంగూ, నాణ్యతా దెబ్బతినకుండా వాటిని నిల్వ చేయడానికి ఇంట్లోనే నేలమాళిగ కట్టించాడు. భార్యాబిడ్డల చేత చింతపండు గుజ్జూ పచ్చళ్ల లాంటివి తయారుచేయించాడు. ఈ క్రమంలో పండు నుంచి గింజ తీయడానికి చాలా సమయం పట్టడం గమనించిన ఖాదర్‌ చింతకాయల నుంచి గింజలు వేరుచేసే యంత్రాన్ని తయారుచేశాడు. కాయలు అందులో వేస్తే చింతపండూ గింజలూ విడివిడిగా వచ్చేస్తాయి. 500 మంది చేసే పనిని ఆ మెషీన్‌ ఒక్కరోజులో చేయగలదు. పచ్చళ్లకోసం పచ్చి చింతకాయల్ని ముక్కలుగా కోయడం మరో పెద్ద పని. దానికోసమూ, చెట్టునుంచిచింతకాయలు కోయడానికీ కూడా ప్రత్యేక యంత్రాలను తయారుచేశాడు. వీటివల్ల ఎంతో సమయంతో పాటు కూలీల ఖర్చూ కలిసొచ్చేది. ఖాదర్‌ ఆవిష్కరణల్ని చూసిన తోటి రైతులు తమ అవసరాలనూ అతని దగ్గర చెప్పుకునేవారు. దాంతో ఎన్నిసార్లు దున్నినా పదును తగ్గని నాగలి కర్రునీ, అన్ని రకాల విత్తనాలనూ నాటేందుకు పనికొచ్చే సీడర్‌నీ... ఇలా రకరకాల యంత్రాలను తయారుచేశాడు. వాటన్నిటికీ పేటెంట్లు తీసుకున్నాడు. ఆయా వస్తువులకు ఉన్న గిరాకీని చూసి పెద్దఎత్తున తయారుచేసి అమ్మేందుకు కంపెనీ పెట్టాడు ఖాదర్‌. సమాజానికి పనికివచ్చే యంత్రాలను వరసగా ఆవిష్కరిస్తూ వచ్చిన అబ్దుల్‌ఖాదర్‌ నదకట్టిన్‌ను నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ తరఫున జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.
ఆ ఒక్క సంఘటన...
ఆర్థిక పరిస్థితులు అనుకూలించక బడి మానేసి ఇంట్లో ఉంది షాజియా జాన్‌. తల్లి పనిమీద ఎక్కడికో వెళ్లింది. అప్పుడు అతిథులు వచ్చారు. షాజియాకు సమోవర్‌లో టీ తయారుచేయడం రాదు. దాంతో వారికి టీ చేసి ఇవ్వలేకపోయింది. ఇంట్లో పెద్దవాళ్లు లేనప్పుడు తాను బాధ్యతగా వ్యవహరించలేకపోయానన్న ఆలోచన ఆమెలో ఆవిష్కర్తను నిద్ర లేపింది. ఫలితంగా సమోవర్‌ని బొగ్గులతో కాక గ్యాస్‌తో పనిచేసేలా తయారుచేసి నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డుని అందుకుంది షాజియా.
టీ తయారుచేసుకోవడం మనకు నిమిషాల్లో పని. కానీ కశ్మీరీలకు చాలా పెద్ద పని. సమోవర్‌ అనే ప్రత్యేక పాత్రలో బొగ్గుల మీద కాయాలి. అందుకు ఎప్పుడూ బొగ్గులు సిద్ధంగా ఉండాలి. ఆ పాత్రలోనే టీ చేయడం వారి సంస్కృతిలో విడదీయరాని భాగం. ఎవరింటికన్నా వెళ్లినప్పుడు టీ ఇవ్వలేదంటే అది అతిథులను అవమానపరిచినట్లే. అందుకే అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటారు సాధ్యమైనంతవరకూ. షాజియా తండ్రికి విద్యుత్తు ఉపకరణాలు మరమ్మతు చేసే దుకాణం ఉంది. ఇంట్లో అమ్మకు సాయం చేయడం, తండ్రి బయటకు వెళ్లినప్పుడు దుకాణంలో కూర్చోడం షాజియా పని. అక్కడ ఖాళీగా కూర్చోక చిన్న చిన్న మరమ్మతు పనులూ చేసేది. అలాంటప్పుడే పై సంఘటన జరిగింది. బొగ్గుల పని లేకుండా సమోవర్‌కి గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. ముందు ఇంట్లో ఉన్న సమోవర్‌ భాగాలన్నీ విడదీసి చూసింది. బర్నర్‌ ఎక్కడ పెట్టాలో, గ్యాస్‌ కనెక్షన్‌ ఎలా ఇస్తే బాగుంటుందో ఆలోచించింది. ప్రయత్నాలు ఒక కొలిక్కి రాగానే తండ్రికి వివరించింది. అతనికీ ఆలోచన నచ్చింది. సమోవర్‌కి సరిపోయేలా బర్నర్‌, రెగ్యులేటర్లను గ్యాస్‌స్టౌ మెకానిక్‌తో ప్రత్యేకంగా తయారుచేయించారు. గ్యాస్‌ సమోవర్‌ తయారైంది. చక్కగా పనిచేస్తోంది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కశ్మీరీల ప్రత్యేకతైన నమ్‌కీన్‌ చాయ్‌తో సహా అన్ని రకాల చాయ్‌లనూ తయారుచేసుకోవచ్చు. పావుగంటలో పాతిక మందికి సరిపడా టీ సిద్ధం చేయొచ్చు. అదే బొగ్గుల సమోవర్‌ అయితే ముప్పావుగంట పట్టేది. మెకానిక్‌ ద్వారా విషయం బయటకు తెలిసిపోయింది. చలికాలంలో సమోవర్‌కోసం బొగ్గుల్ని బంగారంలా దాచుకునే పని తప్పిందంటూ ఆ అమ్మాయి ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. రెండు పదుల వయసులోనే నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డు గెలుచుకున్న ఆ యువతి ఎప్పటికైనా చదువు కొనసాగించాలనీ, గ్యాస్‌ సమోవర్లు తయారు చేసే పరిశ్రమ పెట్టాలనీ కలలు కంటోంది.
జ్వరం... ఓ ఆవిష్కరణకు నాంది!
అతని ఒళ్లు జ్వరంతో కాలిపోతోంది. తడిబట్టతో తుడుస్తోంది భార్య. శరీరంలోని వేడికి రెండు నిమిషాలకే ఆ బట్ట ఆరిపోతోంది. ఆ పరిస్థితి ఆమెకు ఆందోళన కలిగిస్తే ఆయనలో ఆలోచన రేకెత్తించింది. ఆ ఆలోచనే గుజరాత్‌కి చెందిన అరవింద్‌ భాయ్‌ పటేల్‌ని కరెంటు అవసరం లేని వాటర్‌ కూలర్‌ తయారీకి పురికొల్పింది.
అరవింద్‌కి చదువంటే ఇష్టమే కానీ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు కాబట్టి ఆరుగురిలో చిన్నవాడైన అతడి చదువు గురించి ఎవరూ పట్టించుకోలేదు. దాంతో స్కూలు మానేసి పనిలో చేరాడు. సౌదీలో కొన్నేళ్లు పనిచేసి వచ్చి సొంతూళ్లో గ్యారేజ్‌ పెట్టుకున్నాడు. అక్కడ బయటి వస్తువుల మరమ్మతులు తక్కువ. ప్రయోగాలతో ఆయన పాడుచేసేవి ఎక్కువ. స్కూలు టీచరు ఉద్యోగంతో భార్య ఇంటిని నడిపిస్తూ పిల్లల్ని చదివించేది. ఏదైనా స్థిరమైన ఆదాయం వచ్చే ఉద్యోగం చూసుకోమని భర్తకు చాలాసార్లు చెప్పింది. ఓసారి గాలిపటం ఎగరేసే విషయంలో పిల్లలిద్దరూ గొడవపడ్డారు. అన్న గాలిపటం ఎగరేస్తుంటే రీల్‌ పట్టుకుని సాయంచేయాల్సిన చెల్లెలు ఎదురుతిరిగింది. అది చూసిన అరవింద్‌ ఎవరి సహాయమూ అక్కర్లేకుండా గాలిపటం ఎగరేసుకునేలా రీల్‌హోల్డర్ని తయారుచేసిచ్చాడు కొడుక్కి. అలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా భర్తలోని సృజనశక్తిపై నమ్మకం కలిగేది. అంతలోనే ఆర్థిక పరిస్థితి ఆమెను భయపెట్టేది. చేసేది లేక మౌనం వహించేది. ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ అరవింద్‌ చివరకు సాధించాడు. తడిబట్ట సిద్ధాంతాన్ని ఉపయోగించి కరెంటు అవసరం లేకుండా పనిచేసే వాటర్‌ కూలర్‌ని తయారుచేశాడు. దానికి జాతీయ అవార్డు లభించడంతో పేటెంటు తీసుకుని మూడు సైజుల్లో కూలర్లను తయారుచేసి వ్యాపారం ప్రారంభించాడు. అదొక్కటే కాదు, అరవింద్‌ ఇంకా చాలా కనిపెట్టాడు. పంక్చరైన వాహనానికి అక్కడికక్కడే తాత్కాలికంగా రిపేరు చేసే ఆటో ఎయిర్‌ కిక్‌ పంప్‌, ఏ సైజు పాత్రనైనా తేలిగ్గా పట్టుకోగల సురక్షా పట్టకారు, సోలార్‌ వాటర్‌ హీటర్‌... ఇలాంటివి చాలా రకాల పనిముట్లు తయారుచేశాడు. అన్నీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగివున్నవే. వేటికీ ఇంధనంతో పనిలేదు. నటుడు అక్షయ్‌కుమార్‌ ఇటీవల ‘ప్యాడ్‌మ్యాన్‌’ సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇన్నాళ్లూ సినిమాలకు మంచి కథలు దొరకడం లేదనుకున్నాననీ, కానీ ఈ ఆవిష్కర్తలను చూశాక అసలైన కథలు గ్రామాల్లోనే ఉన్నాయని తెలిసిందనీ అనడమే కాదు, వారికి ఆర్థిక సహాయంగా రూ.5 లక్షలు ప్రకటించారు. ఆ సహాయం పొందినవారిలో అరవింద్‌ కూడా ఒకరు. అరవింద్‌ ఎప్పుడూ సమస్యలను వెదుకుతూ ఉంటాడనీ, ఏదైనా సమస్య ఉంటేనే దాన్ని పరిష్కరించేందుకు తనకు చేతినిండా పని దొరికిందని సంతోషిస్తాడనీ నవ్వుతూ చెబుతుంది అతని భార్య.
ఏ చెట్టయినా ఎక్కేయొచ్చు!
సాటివారి కష్టం విని స్పందించే గుణం ఓ రోజుకూలీని వ్యాపారవేత్తను చేసింది. కోయంబత్తూరుకు చెందిన డి.రంగనాథన్‌(డిఎన్‌.వెంకట్‌) పెద్దగా చదువుకోలేదు. ఓ స్పిన్నింగ్‌ మిల్లులో రోజుకూలీగా పనిచేశాడు. కొన్నేళ్లకు మిల్లు మూతపడడంతో చేసేదేమీ లేక వ్యవసాయపనులు చేసుకుంటూ పల్లెలోనే స్థిరపడ్డాడు. రైతుల పనిముట్లకు రిపేర్లూ చేసిపెట్టేవాడు. అలా వారితో మాట్లాడేటప్పుడు చెట్లెక్కేవారు దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులు అతని దృష్టికి వచ్చాయి. తేలిగ్గా చెట్లెక్కడానికి తోడ్పడే సురక్షితమైన పరికరం ఒకటి స్వయంగా తయారుచేయాలని పని ప్రారంభించాడు.
కొబ్బరి చెట్లూ తాటిచెట్లూ ఎక్కి కాయలను కోసేటప్పుడు జరిగే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. దాంతో క్రమంగా అసలా చెట్లెక్కే వృత్తిలోకే ఎవరూ వెళ్లడంలేదు. ఈ పరిస్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వరం మల్టీ ట్రీ క్లైంబర్‌. చక్కగా కుర్చీలో కూర్చున్నట్లు సౌకర్యంగా కూర్చుని ఎంత ఎత్తైన చెట్టయినా అలవోకగా ఎక్కేయొచ్చు ఈ పరికరంతో. సాంకేతికంగానూ భద్రతాపరంగానూ ఉన్నత ప్రమాణాలతో తయారైన ఆ పరికరాన్ని తయారుచేసింది మెకానికల్‌ ఇంజినీర్లు కాదు, మెకానిక్‌ వెంకట్‌. అతడి పదేళ్ల కృషి ఫలితం ఆ పరికరం. అది తాటి, కొబ్బరి ఇలా ఏ రకం చెట్టుకైనా, కాండం వెడల్పు ఎంతున్నా అమరుతుంది. చేతులూ కాళ్లతో పైపైకి అమర్చుకుంటూ ఎలాంటి భయం లేకుండా 40 అడుగుల చెట్టుని ఐదు నిమిషాల్లో ఎక్కేయొచ్చు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా దానిని పరిశీలించి సురక్షితమైనదన్న సర్టిఫికెట్‌ ఇచ్చారు. నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డూ లభించింది. వెంకట్‌కి ముందూ తర్వాతా కూడా కొందరు రకరకాల ట్రీ క్లైంబర్లను తయారుచేశారు కానీ అవి ఒక రకం చెట్లకే పనికొస్తాయి. వేర్వేరు చెట్లకి వేర్వేరు పరికరాలు కొనుక్కోవాలి. వెంకట్‌ పరికరం ఏ రకం చెట్టుకైనా పనికొస్తుంది. ‘ఆర్‌ టెక్‌ ఇంజినీరింగ్‌’ పేరుతో ఇప్పుడు వెంకట్‌ ఈ మల్టీ ట్రీ క్లైంబర్ల వ్యాపారం చేస్తున్నాడు. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాడు.
నీటిగుట్టు ఇతనికి తెలుసు!
ఓ రైతు కుటుంబంలో పుట్టిన గిరీష్‌ భద్రగోండ్‌ పదో తరగతితో చదువు మానేయాల్సి వచ్చింది. ఆత్మహత్య ఆలోచనలను అధిగమించి కట్టుబట్టలతో ఒక్క ల్యాప్‌టాప్‌ పట్టుకుని పదేళ్ల క్రితం బెంగళూరు చేరిన అతడు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓ టెక్నో సంస్థలో భాగస్వామి. ఆ సంస్థ వ్యవసాయానికి పనికొచ్చే పరికరాలు తయారుచేస్తుంది. ఆ పరికరాల రూపశిల్పి అతడే. బోరుబావిలో నీటి లభ్యత స్థాయిని తెలిపే స్కానర్‌ తయారుచేసి రైతులకు వృథా ఖర్చుని తప్పించాడు గిరీష్‌.
ఏడో తరగతిలో ఉన్నప్పటినుంచే గిరీష్‌కి విద్యుత్‌ పరికరాల పట్ల ఆసక్తి ఉండేది. సర్క్యూట్స్‌ గురించి అర్థం చేసుకున్న అతను స్కూల్లో ఉండగానే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రాజెక్టులు చేసిపెట్టేవాడు. చదువు అర్ధాంతరంగా ఆగిపోయినా చేతిలో నైపుణ్యం ఉందన్న ధైర్యంతో ఫ్రెండ్స్‌తో కలిసి ఓ పెద్ద ప్రాజెక్టుకి రంగం సిద్ధంచేసుకున్నాడు. అందరూ తలా కాస్త డబ్బూ వేసుకున్నారు. పని సగంలో ఉండగా వారంతా హఠాత్తుగా వెనక్కి తగ్గారు. డబ్బు తిరిగిచ్చేయమన్నారు. పరికరాలన్నీ అమ్మేసి వారి డబ్బు వారికిచ్చేసిన గిరీష్‌కి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. చదువూ లేదు, ఏదైనా చేయడానికి డబ్బూ లేదు. ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. చివరి ప్రయత్నంగా బెంగళూరు చేరాడు. స్నేహితుడి గదిలో ఉంటూ డీటీహెచ్‌ యాంటెన్నాని రూటర్‌గా మార్చి 10కి.మీ.ల పరిధిలో వినియోగదారులకు బ్యాండ్‌విడ్త్‌ని అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. దాంతో ప్రయోగాలు మొదలుపెట్టాడు. సరైన వర్షపాతం లేక రైతులంతా అవస్థ పడడం, లక్షలు ఖర్చుపెట్టి బోర్లు వేస్తే అందులో నీరు పడకపోవడం రైతు కుటుంబంలో పుట్టిపెరిగిన అతడికి బాగా తెలిసిన కష్టం. దాంతో చాలా శ్రమించి బోరుబావిలో నీటి లభ్యతని కనిపెట్టే స్కానర్‌ని రూపొందించాడు గిరీష్‌. బోరుబావిలో నీరు ఏ స్థాయిలో ఉందీ ఎంతకాలం వస్తుందీ చెప్పగలగడంతో రైతులు దానికి మోటారు బిగించాలా వద్దా, నీటికి తగినట్లుగా ఏ పంట వేయాలీ లాంటి విషయాలు నిర్ణయించుకుంటారు. అతడు తయారుచేసిన మైక్రో ఇరిగేషన్‌ కంట్రోలర్‌ ద్వారా పంపుసెట్లూ, వాల్వులను ఎంత దూరం నుంచి అయినా నియంత్రించవచ్చు. ఫలితంగా ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదు. ఇంకా శబ్దాలతో పక్షులను తరిమేసే పరికరం, పట్టణాల్లో బాల్కనీలూ, డాబాల మీద పెంచే మొక్కలకు రోజూ నిర్ణీత సమయంలో దానంతటదే నీరు అందజేసే పరికరం... ఇలాంటివెన్నో గిరీష్‌ తయారుచేశాడు. ‘నామీద నాకు నమ్మకం ఉండబట్టే ఆరోజు ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నాను. చదువు లేకపోయినా పట్టుదలతో కృషి చేసి ఈ స్థాయికి చేరుకోగలిగాను...’ అంటాడు గిరీష్‌. ఇప్పుడతని ఆవిష్కరణలూ ఎందరో రైతుల ప్రాణాలు నిలబెడుతున్నాయి.
భలే మంచి చౌక పొయ్యి!
కేరళకు చెందిన జయప్రకాశ్‌ గ్యాస్‌ కన్నా చాలా తక్కువ ఖర్చయ్యే కాలుష్యం లేని కట్టెల పొయ్యిని తయారుచేశాడు. కేరళలో కొబ్బరి ఎక్కువగా పండుతుంది కాబట్టి వృథాగా పడేసే కొబ్బరి చిప్పలను కట్టెల బదులు ఇంధనంగా వాడతారు. తేలికైన ఈ పొయ్యి నిరుపేద గ్రామీణులకు వరమని చెబుతూ నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ అవార్డు ఇచ్చింది. జయప్రకాశ్‌ ఒక దినసరి వేతన కార్మికుడు.
పేదరికం వల్ల పదో తరగతిలోనే చదువు మానేసిన జయప్రకాశ్‌ కార్మికుడిగా పనిచేసేవాడు. పని దొరకనప్పుడు పండ్లు అమ్మేవాడు. స్వతహాగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలం ఉండడంతో పొగలేని పొయ్యిల గురించి ప్రభుత్వ ప్రచారం చూసి వివరాలు తెలుసుకున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అలాంటి ఓ పొయ్యి నిర్వహణ బాధ్యత తీసుకున్న జయప్రకాశ్‌ రోజూ దాన్ని గమనిస్తూ  అందులో ఉన్న లోపాలు కనిపెట్టాడు. ఆ లోపాలను పరిష్కరించేందుకు నడుం బిగించాడు. రకరకాలుగా ప్రయోగాలు చేసి స్టౌ మోడల్‌ని మార్చి తయారుచేశాడు. దాంతో మంట వల్ల బయటకు వెలువడే కాలుష్యమూ తగ్గింది. వేడి వృథా కాకపోవడం వల్ల వంట త్వరగానూ అయింది. ఆ మోడల్‌లో ఎంత పెద్ద పొయ్యి అయినా తయారుచేసుకోవచ్చు. జయప్రకాశ్‌ తయారుచేసిన పొయ్యి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల శాఖ అధికారులకూ నచ్చింది. ఐఐటీ సైతం దానిని పరిశీలించి సర్టిఫికెట్‌ ఇవ్వడంతో జయప్రకాశ్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నాడు.
ముగ్గురు ఇంజినీర్లు వంగివున్న ఓ పైపులోకి ఒక వైరుని దూర్చుతున్నారు. ఎంత
ప్రయత్నించినా అది వంపు దగ్గర ఆగిపోతోంది కానీ ఆ చివరికి వెళ్లడం లేదు.
ఇదంతా ఒక రైతు చూసి ‘‘సార్‌, నేను ప్రయత్నించనా?’’ అని అడిగాడు.
‘ఇంత చదువూ తెలివీ ఉన్న మనం మూడు రోజులుగా కష్టపడుతున్నా కానిది చదువూ సంధ్యాలేని ఈ పల్లెటూరి రైతువల్ల అవుతుందా, అమాయకుడు’ అని నవ్వుకుంటూ ‘‘సరే
ప్రయత్నించు’’ అన్నారు ఆ ఇంజినీర్లు.
రైతు తన పొలంలోకి వెళ్ళి ఒక ఎలుకను తీసుకునివచ్చి దాని తోకకి వైరును కట్టి పైపులోకి వదిలాడు. ఆ ఎలుక రెండోవైపు నుంచి బయటకు వచ్చింది, దాంతో పాటే వైరూనూ!!
నోరు తెరిచారా ఇంజినీర్లు.
అర్థమైందిగా... అదండీ సంగతి..!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)