యువకలం...కోలాహలం! (06/04/13)

సెల్‌ చాటింగ్‌కు సై... ఆన్‌లైన్‌ కాలక్షేపానికి సిద్ధం... సరదాలకు ముందు... కొత్త గ్యాడ్జెట్స్‌ని రఫ్ఫాడిస్తాం... ఏ కుర్రకారైనా ఇంతేగా? మరి పుస్తకాలు చదువుతారా? అని అడగండి...'అబ్బో... మాకంత తీరికెక్కడిది?' అనేస్తారు! అయితే ఈ తీరును బ్రేక్‌ చేసే వారూ ఉన్నారు! చదవడమేనా? ఆకట్టుకునే రచనలతో మది దోచేస్తున్నారు...వీళ్ల దృష్టంతా యువతపైనే... అలాంటి కొందరి పరిచయం.
పుస్తకమంటే బద్ధకించే కుర్రాడైనా ప్రేమ, రొమాన్స్‌... పదాలు కనపడితే కళ్లు నులుముకుంటాడు. ఆకట్టుకునే శైలి అందిందా, అక్షరాల వెంట పరుగులు తీస్తాడు. ఇదే మంత్రంతో యువత నాడి పట్టేస్తున్నారు నేటి రచయితలు. చేతన్‌భగత్‌, రశ్మీబన్సాల్‌, రవీందర్‌సింగ్‌, అమీశ్‌ త్రిపాఠి, దుర్జయ్‌దత్తా... పేరేదైనా ముడిసరుకు ప్రేమ, కెరీర్‌, వ్యక్తిత్వ వికాసం, రొమాన్స్‌, స్నేహం, మేనేజ్‌మెంట్‌, భావోద్వేగాలే. ఇంటర్నెట్‌ పరిచయాలు, సెల్‌ఫోన్‌ ప్రేమలతో రవీందర్‌సింగ్‌ 'ఐ టూ హ్యాడ్‌ ఏ లవ్‌స్టోరీ' అల్లితే మూడునెలల్లో లక్షన్నర లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌' అంటూ రశ్మీబన్సాల్‌ స్ఫూర్తి పాఠాలు బోధిస్తే కళ్లకద్దుకుంది యువత. 'డోంట్‌ లాస్‌ యువర్‌ మైండ్‌ లాస్‌ యువర్‌ వెయిట్‌' అని రుజుతా దివాకర్‌ వ్యాయామ పాఠాలు చెబితే మాకేనంటూ ఎగబడి కొనేశారు. తాజాగా చేతన్‌భగత్‌ 'రివల్యూషన్‌ 2020' అమ్మకాల రివల్యూషనే సృష్టిస్తోంది.ఈ డిజిటల్‌ ఏజ్‌లో, స్పీడ్‌ యుగంలో కూడా యువత పుస్తకాలు చదువుతోందా? అంటే... 'అభిమాన రచయిత పుస్తకం కోసం నెలల తరబడి ఎదురుచూడటం, లక్షల కాపీలు అమ్ముడు పోవడమే ఇలాంటి సందేహాలకు సరైన సమాధానం' అంటారు ఉదయన్‌ మిత్ర. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ఎడిటర్‌. కవ్వించే కథ, మనసుకి హత్తుకునే శైలి, కెరీర్‌కి ఉపయోగపడే విషయం, స్ఫూర్తి నింపే రాతలు... ఎప్పుడూ విఫలం కావంటారాయన. ఇవన్నీ ఒకెత్త్తెతే టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో యువ రచయితలు ముందుంటున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లలో తమ రచనల గురించి చర్చిస్తూ పాఠకుల్లో ఉత్సుకత రేకెత్తిస్తున్నారు. కొందరైతే సొంతంగా వెబ్‌సైట్‌, బ్లాగుల్లోనే పుస్తక విక్రయాలు చేసేస్తున్నారు. ఈ స్ఫూర్తితో తమ కలాలకు పదును పెడుతూ కొత్తగా దూసుకొస్తున్న వాళ్లెందరో.
ఇలాగైతే సక్సెస్‌
యువత నాడి పట్టే కథాంశం.
సరళమైన, సూటిదైన పదప్రయోగం.
ఆకట్టుకునే కవర్‌పేజీ డిజైన్‌.
సరైన ఫాంట్ల ఎంపిక. అమరే అక్షరాల నిడివి.
మార్కెటింగ్‌కి పేరున్న ప్రచురణ సంస్థ ఎంపిక.
మొదటి నవలకి స్వయంగా మార్కెటింగ్‌ చేసుకునే తెగువ.
టార్గెట్‌ పాఠకులకు అనుగుణంగా రచనాశైలి.
అనుభవమే అక్షరం
రచయిత: తౌఫిక్‌ పుస్తకం: యాన్‌ ఇడియట్‌, ప్లేస్‌మెంట్స్‌ అండ్‌ ఇంటర్వ్‌ యూ
ప్రచురణ సంస్థ: టైమ్స్‌ గ్రూప్‌
ఇంజినీరింగ్‌ కోసం మహబూబ్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు తౌఫిక్‌. సరికొత్త స్నేహాలు వ్యసనాల ఊబిలోకి లాగాయి. ఆపై ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం. టాపర్‌ కాస్తా సగటు విద్యార్థిగా మారిపోయాడు. ఎలాగో చదువు గట్టెక్కించి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం కొట్టాక పెళ్లి మాటెత్తాడు. లవర్‌ హ్యాండిచ్చింది. ఆ బాధలోంచే అక్షరాలు తన్నుకుంటూ వచ్చాయి. కాలేజీ అనుభవమే ముడిసరుకైంది. ప్రేమ, సంతోషం, విజయం, బాధ... ప్రతి భావాన్ని సూటిగా చెప్పాడు. కుర్రకారు గుండెల్ని తాకాడు. ఇది కేవలం ప్రేమ కథే కాదు. కీలక సమయంలో వ్యసనాలు చేసే చెడు, ఉద్యోగాల కోసం పడే బాధలు అక్షరీకరించాడు. ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలో సూచించాడు. చదివే వాళ్లంతా తమ కథే అనుకునేలా మలిచాడు. పగలు ఉద్యోగం. రాత్రి రచన. ఆలోచనలు నవలారూపం దాల్చడానికి ఆర్నెళ్లు పట్టింది. మొదట్లో సొంతంగా కాపీలు అచ్చు వేయించినా, రెండో ప్రచురణ ప్రముఖ పబ్లిషింగ్‌ సంస్థ టైమ్స్‌ గ్రూప్‌ తీసుకుంది. నాలుగు వేలకు పైగా అమ్ముడయ్యాయి.
రాస్తే హిట్టే!
రచయిత: ప్రీతిషెనాయ్‌ పుస్తకం: టీ ఫర్‌ టూ అండ్‌ ఏ పీస్‌ ఆఫ్‌ కేక్‌
ప్రచురణ సంస్థ: ర్యాండమ్‌ హౌస్‌ ఇండియాకేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతూ దేశమంతా తిరిగింది ప్రీతి. అన్ని రాష్ట్రాల సంస్కృతులు, పరిస్థితులు ఆకళింపు చేసుకుంది. తను గమనించిన అంశాలను మొదటిసారి బ్లాగులో రాసింది. లక్షల క్లిక్స్‌ వచ్చాయి. ఇది గమనించి ఓ ప్రముఖ పత్రిక ప్రత్యేక కాలమ్‌ నిర్వహించమంది. అక్కడా హిట్టే. ఆ ఉత్సాహంతో 2008లో తొలిసారి నవలకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికి నాలుగు రాసింది. అన్నీ బెస్ట్‌ సెల్లర్సే. తాజా రచన లక్ష కాపీలు అమ్ముడైంది. ఆమె ప్రతి రచనలో కథాంశం యువతకి నచ్చే ప్రేమ, రొమాన్స్‌, స్నేహం, కెరీర్‌, కష్టాల్ని ఎదిరించి గెలిచిన అమ్మాయి ధీరత్వం ఉంటాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రీతిని 'ఎక్సలెంట్‌ స్టోరీ టెల్లింగ్‌ స్కిల్స్‌ ఉన్న రచయిత్రి'గా పొగిడితే, అభిమానులు ఆమెని మాటల మ్యాజిక్‌గా అభి వర్ణిస్తారు.
ఇంటర్‌ కుర్రాడి భావోద్వేగం
రచయిత: ముల్కల వేణు పుస్తకం: ఎమోషన్స్‌ ప్రచురణ: సొంతంగా
ద్దరు వ్యక్తుల మధ్య గొడవలు. రెండు సమూహాల మధ్య కక్షలు. రెండు దేశాల మధ్య విద్వేషాలు. కారణం మనిషిలో రగిలే భావోద్వేగాలే. ఆదిలాబాద్‌ కుర్రాడ్ని ఇది ఆలోచనల్లో పడేసింది. ఈ అసహజ భావోద్వేగ తీవ్రతను తగ్గించడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. వ్యాసరచన పోటీల్లో ముందుండే అతడి నేపథ్యం పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. అప్పుడతడు ఇంటర్‌ విద్యార్థి. చదువుతూనే ఖాళీ సమయాల్లో ఆలోచనలకు పని చెప్పాడు. అవి 'ఎమోషన్స్‌' పుస్తకంగా మారడానికి నెలలు పట్టింది. వస్తూనే నాలుగు వేల కాపీలు అమ్ముడయ్యాయి. 'ఒకవిధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలోని మనుషులంతా రక్తసంబంధీకులే. పగ, ప్రతీకారం, కుట్ర, మతవిద్వేషాలు వాళ్ల మధ్య చిచ్చుపెడుతున్నాయి. వీటికి బదులు ప్రేమ, స్నేహం అనుబంధాలు పంచితే మనమంతా ఒక కుటుంబంలా మెలగొచ్చు' అని తన పుస్తకంలో చెప్పాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)