విభిన్నంగా.. విజయపథంలో!
ఉద్యోగం... వ్యాపారం... అభిరుచి... దారి ఏదైనా భిన్నంగా ఉండాలి... విజయాలు వాటంతట అవే వస్తాయి... ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయి... కాస్త సమాజ హితం కూడా తోడైతే... ఇతరులకు స్ఫూర్తిగా నిలవొచ్చు... ఇదే నమ్మకంతో దూసుకెళుతున్నారు కొందరు యువ తరంగాలు... వాళ్లతో మాట కలిపింది 'ఈతరం'.
ఆంధ్రా స్పైడర్మ్యాన్
'నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు' అనే టైపు హైదరాబాద్ కుర్రాడు యశస్వి మోదుకూరు.ఓసారి యూట్యూబ్లో 'పార్కోర్' క్రీడ చూశాడు. అప్పట్నుంచి అతడికదే లోకం.కరాటే, జిమ్నాస్టిక్స్లాగే పార్కోర్ ఓ ఆట. యశస్వి మాటల్లో చెప్పాలంటే 'ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్... ఇట్స్ యాన్ ఆర్ట్'. ఏ ఆధారం లేకుండా గోడలు ఎక్కేయడం, నిలుచున్నచోటే కళ్లు తిప్పుకోలేని విన్యాసాలు చేయడం, పెద్దపెద్ద అడ్డంకుల్ని అమాంతంగా దూకేయడం పార్కోర్ ప్రత్యేకతలు. ఇంగ్లండ్, జపాన్, అమెరికాల్లో బాగా ప్రాచూర్యంలో ఉన్నా ఇండియాలో ఈ కళని అభిమానించి, ఆరాధిస్తున్నవాళ్లు చాలా తక్కువమంది. అక్కడైతే తరచూ పోటీలు జరుగుతుంటాయి. ఇందులో ప్రెసిషన్, క్యాట్లీప్, వాల్రన్, డైనో, వాల్ట్స్, మంకీ వాల్ట్స్, లాంగ్జంప్... అంటూ రకరకాల మూవ్మెంట్లు. ఒక్క అంశంపై పట్టు సాధించాలన్నా నెలలపాటు కఠినంగా సాధన చేయాలి. యశస్వి మూడేళ్ల నుంచి తనకి తానే గురువుగా పార్కోర్ సాధన చేస్తున్నాడు. మధ్యలో ఎన్నోసార్లు ప్రమాదాల బారినపడ్డాడు. అయినా పార్కోర్పై అభిమానంతో సాధన చేస్తూనే ఉన్నాడు. రెండేళ్ల కిందట గోల్కొండ కోటలో 'పార్కోర్ మీట్' జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా 30 మంది పాల్గొన్నారు. ఆ మీట్లో యశస్వి 11 మీటర్ల లాంగెస్ట్ ప్రెసిషన్ చేశాడు.
శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉంచగల ఆట పార్కోర్ అంటాడు యశస్వి. పార్కోర్పై పట్టు సాధిస్తే స్టంట్మ్యాన్గా అవకాశాలు సాధించొచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లకి శిక్షణ ఇవ్వొచ్చు. యశస్వి ఇప్పటికి నలుగురికి శిక్షణనిచ్చాడు. భవిష్యత్తులో పార్కోర్ స్కూల్ పెట్టడమే నా లక్ష్యం' అంటున్నాడు డిగ్రీ సెకండియర్ చదువుతున్న యశస్వి. |
పదిగంటల పని... టర్నోవర్ కోటిన్నర! అమెరికాలో ఉద్యోగం. లక్షల్లో వేతనం. జీవితాన్ని జాలీగా గడిపేయొచ్చు.అరవింద్ మత్య్సరాజదాంతో సరిపెట్టుకోలేదు. ఉద్యోగం చేస్తూనే సరికొత్తగా ఆన్లైన్ వ్యాపారం మొదలుపెట్టాడు. మూడేళ్లలో కోటిన్నర టర్నోవరుకు ఎదిగాడు. అతడి ప్రతిభ గుర్తించి 'ఆ కిటుకులేవో మా విద్యార్థులకూ నేర్పండి' అంటూ ఆహ్వానం పలికాయి అమెరికా విశ్వవిద్యాలయాలు.వయసులో ఉన్నపుడు కష్టపడితే జీవితమంతా సుఖంగా గడపొచ్చు. ఉడుకు రక్తం ఉరకలెత్తే పాతికేళ్ల యువకుడి నమ్మకం ఇది. అరవింద్లో ఈ దూకుడు చిన్నపుడే మొదలైంది. పందొమ్మిదేళ్లకే ప్రత్యేక అనుమతి తెచ్చుకొని మరీ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలెక్షన్లో అమెరికా కంపెనీకి ఎంపికయ్యాడు. ఉద్యోగం చేస్తూనే మిషిగాన్ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తిచేశాడు. అక్కడి విద్యార్థులందరితో పోటీపడి స్కాలర్షిప్ అందుకున్నాడు.
మంచి ఉద్యోగంతో బండి కులాసాగా సాగిపోతున్నా అక్కడే ఆగిపోవాలనుకోలేదు అరవింద్. ఖాళీ సమయంలో 'డ్రీమ్ వీవర్' అనే ఈ కామర్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇదో ఆన్లైన్ బయింగ్ వెబ్సైట్. వినియోగదారులు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువుల్ని నేరుగా ఇంటికి చేరుస్తుంది. దీనికోసం అరవింద్ కేటాస్తున్న సమయం వారానికి పది నుంచి పన్నెండు గంటలు. కంపెనీ ప్రారంభించేటపుడు 'బుద్ధిగా ఉద్యోగం చేసుకోక ఎందుకీ తిప్పలు?' అన్నారు కొంతమంది. ముందు చిన్నచిన్న కంపెనీలతో మొదలై ఫార్చూన్- 500 గ్రూపు కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకున్నాడు. మొదటి సంవత్సరమే టర్నోవర్ కోటికి చేరింది. అయితే... ఏడాది తిరిగేలోపే పరిస్థితి తలకిందులైంది. కొన్ని సంస్థలు ఉన్నపళంగా ఒప్పందం రద్దు చేసుకున్నాయి. వ్యాపారం సగానికి పడిపోయింది. ఈసారి ఆచితూచి అడుగేశాడు. మూడో ఏడాది కోటిన్నరకి చేరాడు. అరవింద్ విజయాన్ని పలు విశ్వవిద్యాలయాలు గుర్తించి, తమ విద్యార్థులకు సెమినార్లు నిర్వహించమని కోరాయి. వాటితో పాటు పత్రికలకు వ్యాసాలూ రాస్తున్నాడు అరవింద్. |
చెత్త నుంచి సిరులు మాణిక్ థాపర్ ఎంబీఏ చేసిన కుర్రాడు. అమెరికాలో స్థిరపడాలనుకున్నా, ఓ మిత్రుడు స్వదేశం గురించి చేసిన చులకన మాటలతో ఇండియా తిరిగొచ్చాడు. ఆ మాటలనే సవాలుగా చేసుకుని ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం మొదలుపెట్టాడు. అదే ఇప్పుడు అతడికి సిరులు కురిపిస్తోంది.'ఇండియాలో ఎక్కడ చూసినా వ్యర్థాలే. అంత చెత్త దేశంలో ఎలా ఉంటావ్?' అని ఓ మిత్రుడు గేలి చేయడమే అతడి పట్టుదలకు కారణమైంది. మిత్రుడి దురభిప్రాయాన్ని కొంచమైనా మార్చాలనే ఉద్దేశంతో ఇండియా వచ్చి 2005లో ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో 'ఎకోవైజ్ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీ ప్రారంభించాడు. కోటిన్నర పెట్టుబడి, వంద మంది ఉద్యోగులు. బయట పారబోసే చెత్త, వ్యర్థాలను తమకిచ్చేలా మాల్స్, పరిశ్రమలు, ఆఫీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా రోజూ పోగయ్యే మొత్తం 400 టన్నుల చెత్తను పొడి, తడిగా విడదీసి సేంద్రీయ ఎరువులు తయారు చేసే లక్ష్యం. ఇంకా పనికిరాని వ్యర్థాలను రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మాణిక్ కంపెనీ కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న లాభసాటి కంపెనీ. నోయిడాలోని మొత్తం చెత్తలో పదిశాతం ఈ ఒక్క కంపెనీయే సేకరిస్తోంది. 'నా చేతులు మురికిగా మారినా ఫర్వాలేదు. నగరం శుభ్రంగా ఉండటమే నాకు కావాల్సింది' అంటాడు మాణిక్. |
ప్రకృతి ఒడిలో... పెద్ద ఫార్మా కంపెనీలో మేనేజర్. సమాజంలో గౌరవం. ఇవేం హైదరాబాదీ అమ్మాయిరమ్యరవికి సంతృప్తినివ్వలేదు. ఉద్యోగం మానేసి కెమెరా భుజానికి తగిలించుకుంది. అడవులన్నీ తిరుగుతూ అందాల వన్యప్రాణుల్ని ఫొటోలుగా బందిస్తోంది.వన్యప్రాణి సంరక్షణ అనగానే అందరికీ అడవులే గుర్తొస్తాయి. కానీ 'పట్టణీకరణతో వన్యప్రాణులు ముఖ్యంగా పక్షులు తమ ఉనికిని కోల్పోతున్నాయి' అంటోంది రమ్య. వాటిని ఆధారాలతో సహా నిరూపించడానికి ఐదునెలలు కష్టపడి 'వింగ్డ్ అర్బనర్స్' అనే డాక్యుమెంటరీ తీసింది. పదేళ్ల కిందట హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ బిల్డ్ డక్, రెడ్ వాటిల్డ్, లాపింగ్ గ్రే హెరాన్స్, పాండ్ హెరాన్స్ ఇలా ఎన్నో అరుదైన పక్షులకు నిలయం. కాలుష్యం, అధిక జనాభా కారణంగా అవి కనిపించడం అరుదైంది. ఈ వివరాల్ని డాక్యుమెంటరీలో వివరించింది. ఈ పరిస్థితికి కారణాలేంటి? నగరంలో ఉన్న పక్షి జాతులెన్ని? నగరం మళ్లీ పక్షులతో కళకళలాడేలంటే ఏం చేయాలి? స్కూళ్లు, కాలేజీలు తిరిగి విద్యార్థులకు చెబుతోంది. వైల్డ్లైఫ్ స్వచ్ఛందసంస్థల తరపున పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహిస్తోంది.
చిన్ననాటి నుంచే రమ్యకు వన్యప్రాణులపై ప్రేమ. పక్షుల కిలకిలరావాలంటే ఇష్టం. నాన్న ఎయిర్ఫోర్స్ ఉద్యోగి. ఇంట్లో రకరకాల కెమెరాలుండేవి. కనపడ్డ ప్రతి పక్షినల్లా ఫొటోలు తీసేది. ఈ ఇష్టమే ఉద్యోగం వదులుకునేలా చేసింది. మూడేళ్ల కిందటి నుంచి పూర్తిగా వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణకే సమయం కేటాయిస్తోంది. దీని కోసం తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు శ్రీలంక అడవులకూ వెళ్లొచ్చింది. తన అభిరుచి కోసం రమ్య మిగుల్చుకున్న డబ్బుల్ని సైతం వెచ్చించడం విశేషం. |
|
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి