జలసంక్షోభం (Eenadu Sunday Magazine 19/03/2012)




జలసంక్షోభం


నీళ్లసీసాల్ని బ్యాంకు లాకర్లో దాచుకోవాలి. లేదంటే, ఏ దొంగలో ఎత్తుకెళ్తారు. నిండుబిందెల్ని నేలమాళిగల్లో భద్రపరుచుకోవాలి. లేదంటే, ఏ దోపిడీ ముఠాలో దోచుకెళ్తాయి. ఇదంతా కల్పన కాదు. తరాల నిర్లక్ష్యానికి త్వరలోనే మనం చెల్లించబోతున్న మూల్యం.
పురోగమనం...
జలవనరుల్ని వెతుక్కుంటూ మనిషి సాగించిన ప్రయాణమే...నాగరికత. నీటి ప్రాధాన్యం తెలుసుకోవడం మానవ వికాస చరిత్రలో ఓ మైలురాయి. ఆ గలగలల వెంబడే పరిగెత్తాడు. నదీతీరాల్లో నివాసాలు కట్టుకున్నాడు. పంటలు పండించాడు. కార్ఖానాలు నడిపాడు. సరుకుల్ని ఓడలకెత్తించి వర్తకం చేశాడు. అక్షరాల్ని కనిపెట్టాడు. ఆలోచనల్ని విస్తరించుకున్నాడు. సృష్టిమూలాలపై ఆసక్తి పెంచుకున్నాడు. తెలియని శక్తికి దేవుడని పేరుపెట్టాడు. నీటికి దైవత్వాన్ని ఆపాదించాడు. ప్రవాహాల పక్కనే పుణ్యక్షేత్రాలు కట్టాడు. జలసంపద ఉందంటే, సకల సంపదలూ ఉన్నట్టేనని భావించాడు.జలమే బలం. జలమే జయం!
తిరోగమనం..
జీవనదులు కళతప్పాయి. చెరువులు రియల్‌ఎస్టేట్‌ వెంచర్లుగా మారాయి. కుంటలు కనిపించకుండా పోయాయి. భూగర్భం...గర్భవిచ్ఛిత్తికి గురైంది. పాతాళానికి పైపులేసినా...చుక్క నీరు కూడా దొరకదు.
గొంతెండిపోతోంది. పంటెండిపోతోంది. రాకాసికరవు రాజ్యమేలుతోంది.జలంతో నాగరికుడైన మనిషి.. నీటికరవుతో మళ్లీ మృగసమానుడు అవుతున్నాడా? భవిష్యత్‌లో నీటికోసం యుద్ధాలు జరుగుతాయా?
జరుగుతాయి. నిస్సందేహంగా జరుగుతాయి. మనిషి మేల్కొనకపోతే, తీరు మార్చుకొనకపోతే...బిందెలు ఆయుధాలై పైకిలేస్తాయి. నీటి ట్యాంకర్ల కోసం యుద్ధట్యాంకులు రంగంలో దిగుతాయి. జలవనరుల చుట్టూ సైనికదళాల్ని మోహరించాల్సిన పరిస్థితి రావచ్చు.
20వ శతాబ్దాన్ని చమురు శాసించింది.
21వ శతాబ్దాన్ని నీరు ప్రభావితం చేస్తుంది!


గొంతెండుతోంది
జీవనదులు... భూగర్భం...
వర్షాలకు నిండే వాగులూవంకలూ... ఈ మూడూ మనిషికి జలనిధులు.
భూగోళంలో 70 శాతం నీరే. అందులో 97 శాతం ఉప్పునీరు. మిగిలిన మూడుశాతం మంచినీళ్లు. అందులోనూ సగానికిపైగా మంచురూపంలో ఉంది. మహా అయితే, ఒకటి నుంచి ఒకటిన్నర శాతం మాత్రమే సురక్షితమైన తాగునీరు. కోటానుకోట్ల మానవాళి గొంతు తడుపుకోడానికి ఆ కాసిన్ని నీళ్లే ఆధారం.పర్యావరణ వినాశం...అనేకానేక దుష్ఫరిణామాలకు కారణం అవుతోంది. అడవులు కుంచించుకుపోతున్నాయి. పచ్చదనం నాశనమైపోతోంది. ప్రకృతిలో సమతౌల్యం లోపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు తగ్గిపోతున్నాయి. జీవనదులు బక్కచిక్కిపోతున్నాయి. దీంతో నీటివనరులు అడుగంటుతున్నాయి. అవసరాలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి. జనాభా అధికమవుతోంది. పారిశ్రామిక రంగానికి మరింత నీరు కావాలి. సేద్యానిది ఎప్పుడూ సింహభాగమే. మనకున్న జలవనరుల్లో 85 శాతం వ్యవసాయానికే. ఈ సరఫరాలో ఒక్కశాతం తగ్గినా.. తీవ్రస్థాయిలో ఆహారకొరత ఏర్పడుతుంది. జనాభా పెరగడంతో, 1970తో పోలిస్తే నీటివాడకం రెట్టింపు అయింది. సరఫరా మాత్రం రవంత కూడా పెరగలేదు. ఎంతోకొంత తగ్గింది కూడా. ఫలితంగా, జలవనరుల మీద ఒత్తిడి పెరుగుతోంది. నీటి కష్టాలు అధికం అవుతున్నాయి. ఆసియాలో ఆ తీవ్రత మరీ ఎక్కువ. కారణం, ప్రపంచ జనాభాతో పోలిస్తే... ప్రపంచ జలవనరుల్లో ఆసియా వాటా అతి తక్కువ. నీటి కొరత అంతర్జాతీయ సమస్యే అయినా... తొలి దెబ్బ మాత్రం మనకే! పట్టిక చూస్తే పరిస్థితి అర్థమైపోతుంది.


మనిషి - నీరు
తకడానికి నీరు కావాలి. బతుకు సాగించడానికీ నీరు కావాలి. శరీర వ్యవస్థలో నీటికున్న ప్రాధాన్యం అంతాయింతా కాదు. నీరు లారీ డ్రైవరులాంటిది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకవిలువల్ని వివిధ భాగాలకు చేరవేస్తుంది. నీరే లేకపోతే...ఆ పోషక విలువల పంపిణీ బంద్‌. మంచమెక్కాల్సిందే. మన శరీరంలో 70 శాతం దాకా నీరే. ఆహారం లేకుండా ఐదువారాలు బతకొచ్చు కానీ, నీళ్లు లేకుండా ఐదు రోజులు కూడా ఉండలేం. ఒంట్లో తగినంత నీరు లేకపోవడం...ప్రాణానికే ప్రమాదం. మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాల్ని నీటిద్వారానే బయటికి పంపుతాయి. నీరు లేకపోతే, ఆ చెత్తంతా అలానే పేరుకుపోతుంది. తగిన మోతాదులో నీరు అందకపోతే...చర్మం పొడిబారిపోతుంది. కండరాల్లో కదలిక సమస్యలొస్తాయి. వూపిరితిత్తులు, గుండె సక్రమంగా పనిచేయవు. అందుకే రోజుకు కనీసం రెండులీటర్ల నీళ్లయినా తాగాలంటారు డాక్టర్లు. వేసవిలో ఆ మోతాదు మరింత పెరగాలి. గొంతు తడుపుకోడానికో, దప్పిక తీర్చుకోడానికో మాత్రమే కాదు...పరిపూర్ణ ఆరోగ్యం కోసం తాగాలి. నీటి కొరత తీవ్రంగా ఉన్న రాజస్థాన్‌ లాంటి ప్రాంతాల్లో...చర్మరోగాలు మొదలు మూత్రపిండాల సమస్య దాకా...అనేకానేక రుగ్మతలు రాజ్యమేలుతున్నాయి. నీటికరవు మనసు మీదా ప్రభావం చూపుతుంది. మానసిక జాడ్యాలకు కారణం అవుతుంది.ఇదంతా వ్యక్తికి సంబంధించి. వ్యవస్థను ఇరుకునపెట్టే ప్రభావాలూ ఉన్నాయి. తగినంత సాగునీరు అందకపోతే, పంటలెండిపోతాయి. దిగుబడి తగ్గిపోతుంది. ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతాయి. డ్యాములు నిండుకుంటే, జలవిద్యుత్‌ తగ్గిపోతుంది. పారిశ్రామిక ప్రగతి మందగిస్తుంది. లాకౌట్లు పెరుగుతాయి. నిరుద్యోగం అధికం అవుతుంది.
పరిస్థితి ఇలానే ఉంటే, 2030 నాటికి భారత్‌లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెచ్చరిస్తోంది. ఈ కన్నెర్రకు కారణం ఉంది. 2030 నాటికి దేశ జనాభా రెట్టింపు అవుతుంది. అంటే నీటిసరఫరాను 700 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నుంచి 1400 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పెంచితీరాలి. దాదాపుగా అసాధ్యమైన పనే ఇది. ఇక అంతమంది ఆకలి తీర్చాలంటే, ఎంత పంట పండించాలి? అందుకు ఎంత సాగునీరు కావాలి? ఇప్పటికే భూగర్భాన్ని ఎంతగా పిండేయాలో అంతగా పిండేశాం. తవ్వితీసుకోడానికి అక్కడేమీ మిగలదు. ఆ జలసంక్షోభం నుంచి ఎలా బయటపడాలి?
...తలుచుకుంటేనే వణుకుపుడుతుంది.

కాలకూట జలం
గుక్కెడు కలుషిత జలం చాలు, అంటువ్యాధులూ అనారోగ్యాలూ ముసురుకోడానికి. రకరకాల కాలుష్యాల వల్ల నీటి స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆ ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి.
సురక్షితం కాని నీరు ప్రతి ఇరవై సెకెన్లకూ ఒక పసివాడిని పొట్టనపెట్టుకుంటోంది. అంటే, ఆ కాలకూట జలం తాగి...నిమిషానికి మూడు, గంటకు నూట ఎనభై పసిమొగ్గలు రాలిపోతున్నాయి.ప్రపంచంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరికి...సురక్షితమైన మంచినీరు అందడం లేదు. ఏటా దాదాపు నలభైలక్షలమంది కలుషిత జలాల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై, ప్రాణాలు కోల్పోతున్నారు.
కాలకృత్యాలు తీర్చుకోడానికీ వ్యక్తిగత పరిశుభ్రతకూ తగినంత నీరు దొరకని పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. యుద్ధ మరణాల కంటే కూడా, అలా చనిపోతున్నవారే ఎక్కువని ఓ అంచనా.
ఒక్క అతిసార వల్లే ఏటా పదిలక్షలమంది మరణిస్తున్నారు.
సురక్షితమైన మంచినీరు అందించగలిగితే...నూటికి తొంభై వ్యాధులను నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతిపౌరుడికీ జీవించే హక్కునిచ్చింది. ప్రజలందరికీ సురక్షితమైన నీటిని అందించలేకపోవడం అంటే, ఆ హక్కుకు భంగం కలిగించడమే. ఈ కేసులో తొలి ముద్దాయి ప్రభుత్వమే. ఓ అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన తాగునీరు అందిస్తున్న దేశాలూ...అరక్షితమైన నీటితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దేశాలూ ఇవే...


జల సాధికారత
నీటిని 'గంగమ్మ' అని పిలుస్తాం. మాతృత్వపు హోదానిచ్చి స్త్రీత్వాన్ని ప్రసాదించాం. పురుషుడితో పోలిస్తే...మహిళకు నీటితో అవసరమూ అనుబంధమూ ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిల్లిపాది నీటి అవసరాలనూ ఇల్లాలే తీరుస్తుంది. బావుల నుంచీ చెరువుల నుంచీ బిందెల్లో మోయాల్సిన బాధ్యత కూడా ఆమెదే. వంటావార్పులకూ అంట్లు తోముకోడానికీ గంగాళాల నిండా నీళ్లు కావాలి. లేదంటే పనులు సాగవు. అందుకే ఆ తల్లి, బిందె నెత్తిన పెట్టుకుని మైళ్లకు మైళ్లు నడుస్తుంది. మండుటెండలనూ ముళ్లదార్లనూ మౌనంగా భరిస్తుంది. ఏ రికార్డులకూ ఎక్కని శ్రమదోపిడీ ఇది. 'ఆ లక్షల లక్షల పనిగంటలతో మహాసామ్రాజ్యాల్ని నిర్మించవచ్చు' అంటుంది వాటర్‌.ఆర్గ్‌ అనే స్వచ్ఛంద సంస్థ. ఇప్పటికీ అనేక గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం లేదు. బిక్కుబిక్కుమంటూ మహిళాజనం వూరవతలికి వెళ్లాలి. ఇదామె ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. మరుగుదొడ్ల నిర్మాణం నీటి సౌకర్యంతో ముడిపడి ఉంది. రాజస్థాన్‌లోని కొన్ని గ్రామాల్లో అయితే, నీటికొరత విడాకులకూ కారణం అవుతోంది. కనీస అవసరాలకు కూడా నీరులేని కొంపలో మేం కాపురం చేయలేమంటూ ఆడపడుచులు పుట్టింటికి ప్రయాణం అవుతున్నారు. ఆ వూరి కుర్రాళ్లకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మన పాలకులకు మాత్రం, ఇదేమీ పట్టడంలేదు. నీటి సరఫరాను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేసి, చల్లగా జారుకోవాలని చూస్తున్నారు.

'మహా' దాహం!
పాధి కోసం పల్లెలన్నీ పట్టణాలకు వలస వెళ్తున్నాయి. దీంతో మహానగరాల మీద ఒత్తిడి ఎక్కువవుతోంది. ఉన్న కొద్దిపాటి నీటివనరులు కోట్లాదిమంది దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. నగరపాలక సంస్థలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి. ఏటికేడాది అవసరాలకూ సరఫరాకూ మధ్య అగాథం పెరుగుతోంది. 2050 నాటికి సగం భారతదేశం నగరాల్లోనే ఉంటుందని అంచనా. ప్రస్తుత జనాభాకే నీరందించలేని దుస్థితిలో ఉన్నాం మనం.

సమర్థత + పొదుపు + టెక్నాలజీ = పరిష్కారం

ఉన్న వనరుల్ని చక్కగా వాడుకోవాలి. ఆ వాడుకోవడమూ చాలా పొదుపుగా జరగాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ త్రిముఖ వ్యూహంతోనే జలసంక్షోభాన్ని నివారించగలం.
మన డ్యాముల నీటినిల్వ సామర్థ్యం చాలా తక్కువ. ఒక్కొక్కరికి 200 క్యూబిక్‌ మీటర్ల చొప్పున మాత్రమే నిల్వచేయగలవు. చైనా లాంటి దేశాల్లో ఆ సామర్థ్యం, మన కంటే ఐదురెట్లు ఎక్కువ.ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాం. అపార్ట్‌మెంట్లూ ఇళ్ల 'ప్లాన్‌'లకే అవి పరిమితం అవుతున్నాయి. జానెడు జాగా కూడా ఖాళీగా వదలకూడదన్న కక్కుర్తి. భూగర్భం 'రీఛార్జ్‌' కావడానికి ఇంకుడు గుంతలు చాలా ఉపయోగపడతాయి.
నదుల అనుసంధానంపై సాక్షాత్తు సుప్రీంకోర్టు చివాట్లుపెట్టినా, తోలుమందం పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. వేల టీఎంసీల నదీజలాలు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయి. వాటిని నిలబెట్టుకుంటే... ఇంత కరవు ఉండదు.
సరఫరాలో వృథాను అరికట్టడంలో మనం ఘోరంగా విఫలం అవుతున్నాం. ఢిల్లీలో 35 శాతం, ముంబయిలో 30 శాతం నీరు వృథాగా పోతోంది. హైదరాబాద్‌లో నలభై శాతానికిపైగా రక్షిత మంచినీరు నాలాల పాలవుతోందని అంచనా. మీటర్ల విధానం ద్వారా ... కచ్చితమైన నీటిలెక్కలు తీయడం సాధ్యమవుతుంది. సిబ్బందినీ, ప్రజలనూ జవాబుదారులను చేయవచ్చు.
వ్యవసాయ రంగంలో నీటి వృథాను అరికట్టగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్టే. ఎందుకంటే, మన జలవనరుల్లో 80 శాతం సేద్యానికే కేటాయిస్తున్నాం. బిందు సేద్యం ద్వారా, తుంపర్ల సేద్యం ద్వారా ఆ లోపాన్ని అధిగమించవచ్చు. తక్కువ నీటితో పండించగల రకాల్ని అభివృద్ధి చేసుకుంటే మరింత ప్రయోజనం.
నీటివనరుల్లో ఆరుశాతం పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటున్నాం. కాస్త శ్రద్ధపెడితే, అక్కడా వృథాను అరికట్టవచ్చు. పొదుపుగా వాడుకున్న సంస్థలకు పన్ను రాయితీలూ, వృథాకు పాల్పడిన సంస్థలకు జరిమానాలూ ఎంతోకొంత ప్రభావం చూపుతాయి. పారిశ్రామికవాడలన్నీ మహానగరాల చుట్టూ ఉన్నాయి కాబట్టి, శుద్ధిచేసిన జలాల్ని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు.
ఆ వందగజాల భూమి మనదైనంత మాత్రాన, అట్టడుగు పొరల్లోని జలధార మీద కూడా మనకు హక్కులొచ్చేస్తాయా? నీరు అందరి ఆస్తి. బోరుబావుల్ని యథేచ్చగా తవ్వేయకుండా, నీటిని విచక్షణలేకుండా తోడేసుకోకుండా నిబంధనలు కఠినం చేయాలి.
బాట్లింగ్‌ యూనిట్లలో పారిశ్రామిక సంస్థల్లో సీసాల్నీ పాత్రల్నీ శుభ్రం చేయడానికి నీళ్లే అక్కర్లేదు..గాలి ప్రవాహం (ఎయిర్‌ ప్రెషర్‌)తోనూ ఆ పని చేయవచ్చు. ఇదేమంత ఖరీదైన టెక్నాలజీ కూడా కాదు.

సింగపూర్‌ పాఠం
సింగపూర్‌ పాఠం...చిన్నదేశమే అయినా, సింగపూర్‌ జలవిజయం మనకో పాఠం. చక్కని ప్రణాళికతో ప్రజాభాగస్వామ్యంతో నీటికరవును అధిగమించింది. సింగపూర్‌ ప్రభుత్వం చుక్క నీటిని కూడా వృథాగా పోనివ్వడం లేదు... మురుగునీరు, మురికినీరు దేన్నయినా సరే స్వచ్ఛమైన మంచినీటిగా మార్చే టెక్నాలజీని రూపొందించుకుంది. నిజానికి ఆ దేశానికున్న జలవనరులు చాలా పరిమితం. అయితేనేం, రాబోయే యాభై ఏళ్లలో కూడా నీటిసమస్య రాకుండా జాగ్రత్తపడుతోంది.

భూగర్భజలాల సద్వినియోగం ... ఉన్న కొద్దిపాటి వనరుల్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటోంది.
శుద్ధిచేసిన జలాల వాడకం...నీటిశుద్ధికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది.
సముద్రజలాల్ని మంచినీరుగా మార్చుకోవడం... దీని ద్వారా పదిశాతం అవసరాలు తీర్చగలుగుతోంది.ఆ దేశ విస్తీర్ణం 710 చదరపు కిలోమీటర్లే అయినా..ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా, మొత్తం భూగర్భంలో ఇంకిపోయేట్లు జాగ్రత్తపడుతోంది. వర్షపునీటిని ఒడిసిపట్టడంలో నగర ప్రాంతాలకు మరింత ప్రాధాన్యం ఇస్తోంది. నిర్మాణాలు కూడా అందుకు అనువుగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రేపటి తరానికి నీటి పొదుపు విలువ తెలిసేలా...పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకొచ్చింది.
నేర్చుకునే మనసుండాలే కానీ, మన దేశంలోనూ ఎన్నో ఉదాహరణలు. మహారాష్ట్రలోని హివ్రేబజార్‌ గ్రామప్రజలు వర్షపు నీటిని అమృతంలా ఒడిసిపట్టుకుంటున్నారు. చెక్‌డ్యాముల ద్వారా ఎక్కడికక్కడ నిల్వచేస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. సహజవనరుల సద్వినియోగంపై ఏర్పాటైన అశోక్‌ చావ్లా కమిటీ 'ఇలాంటి పల్లెలే జలవనరుల సంక్షోభానికి పరిష్కారం చూపుతాయి..' అని కొనియాడింది. అన్నాహజారే స్వగ్రామం రాలెగావ్‌సిద్ధి కూడా సమష్టికృషితో జలస్వావలంబన సాధించింది.


ప్రతి చుక్కా విలువైందే...

ఒక్కో బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. నీటి ఆదా అన్నది మన నుంచే మొదలు కావాలి..
చిన్నచిన్న లీకేజీల వల్ల బోలెడంత నీరు వృథాగా పోతోంది. ఎక్కడ ఏ చిన్న సమస్య కనిపించినా, ప్లంబర్‌ను పిలిపించి మరమ్మతు చేయించాలి.
బాత్‌టబ్‌లూ షవర్‌బాత్‌ల వాడకమే పెద్ద వృథా. చక్కగా ఓ బకెట్‌ నీటితో స్నానాదులు ముగించేస్తే సమస్యే ఉండదు.
డిష్‌వాషర్లూ వాషింగ్‌మెషీన్లూ...పూర్తి కెపాసిటీలో మాత్రమే ఉపయోగించాలి. పని తక్కువైతే, నీటి వినియోగం ఎక్కువైనట్టే. యంత్రాల ద్వారా బట్టలు ఉతకడానికీ అంట్లు తోమడానికీ ఉపయోగించిన నీటిని టాయిలెట్‌ అవసరాలకు వాడుకోవచ్చు.పళ్లు తోముకునేప్పుడు, వాష్‌బేసిన్‌లోని కుళాయి పారుతూ ఉండాల్సిన పన్లేదు. మగ్గులో నీళ్లు నింపుకుని, శుభ్రంగా కట్టేయండి. గెడ్డం గీసుకుంటున్నప్పుడూ ఈ సూత్రమే వర్తిస్తుంది. దీనివల్ల ప్రతిసారీ పదకొండు లీటర్ల నీటిని ఆదా చేసినవాళ్లం అవుతాం.
సింక్‌లోని నల్లాను విప్పేసి...పారుతున్న నీటిలో కూరగాయలు కడగడం కంటే, ఓ పాత్రలో నీళ్లు నింపుకుని శుభ్రం చేసుకోవడమే ఉత్తమం. దీనివల్ల పద్నాలుగు లీటర్ల నీరు ఆదా అవుతుంది.
ఎన్ని నీళ్లు ఖర్చుచేశామన్నది కాదు, ఎంత శుభ్రంగా స్నానం చేశామన్నది ముఖ్యం. ఎప్పటి కంటే ఓ నిమిషం ముందు స్నానం ముగించినా తొమ్మిది లీటర్ల నీటిని పొదుపు చేసినట్టే.
ఆర్థిక పాఠాలు నేర్పించినట్టే, ఆరోగ్యసూత్రాలు బోధించినట్టే, పిల్లలకు నీటిపొదుపు గురించీ చెప్పాలి. వాటిని పాటించేలా చూడాలి. నీటిని జాగ్రత్తగా వాడుకునేవారు, తమకున్న సమయాన్నీ నైపుణ్యాన్నీ కూడా సమర్థంగా వినియోగించుకోగలరు.
ఇల్లు కడగడం కంటే, తడిగుడ్డతో తుడవడమే మంచిది. శ్రమ తగ్గుతుంది. నీరు ఆదా అవుతుంది.
అపార్ట్‌మెంట్‌ స్థాయిలోనే నీటిశుద్ధి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. అతిగా షాంపూలూ సబ్బులూ డిటర్జెంట్లూ వాడకపోతే..నీటిని శుద్ధిచేయడం తేలికే.
తెల్లవారుజామున లేదా సాయంత్రం మొక్కలకు నీళ్లుపోయడం మంచిది. ఆ సమయంలో అవి తక్కువ నీటిని తీసుకుంటాయి.
వ్యక్తిగా పొదుపుచేద్దాం. కుటుంబాన్ని ప్రోత్సహిద్దాం. పొరుగువారికి చాటిచెబుదాం. ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం.
'అంతపెద్ద సమస్యను మనం పరిష్కరించగలమా?' అన్న నిరాశవద్దు.
'మానవ ప్రయత్నం' అన్న మాట ఉండనే ఉంది.
గంగను దించిన భగీరథుడు మనవాడే, మానవుడే!
మన కోసమే, మనందరి కోసమే రెండు హైడ్రోజన్‌ అణువులూ, ఒక ఆక్సీజన్‌ అణువూ ఒక్కటై చల్లని నీటి చుక్కగా మారాయి.
అందుకు కృతజ్ఞతగా...మనమంతా ఒక్కటవుదాం.
నీటిని రక్షించుకుందాం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)