రైతుల కంట పున్నమి పంట

నేడు ఏరువాక పౌర్ణమి 
రైతుల కంట పున్నమి పంట
భూమిలోని సారాన్ని ఆహారంగా మార్చి, సమాజాన్ని పోషించేది రైతు... మన శరీరాలకు అన్నం రూపంలో ప్రాణశక్తిని  అందించే దైవమాయన... అందుకే రైతులేనిదే రాజ్యం లేదని ఏనాడో గుర్తించారు... ‘మెతుకు పెట్టే రైతన్న బతుకు నిలిపే పెద్దన్న’ అంటూ వర్ణించారు. రైతును, భూమిని, పంటను, పశువును పూజించడం భారతీయ జీవన విధానంలో ముఖ్య భాగాలు..  అన్నదాత తల్లిలా పూజించే భూమికి మొక్కి సాగుకు శ్రీకారం చుట్టే అద్భుత ఘట్టమే ఏరువాక...
ప్రకృతిలో దొరికే పదార్థాలను యథాతథంగా వాడుకునే దశనుంచి వాటిని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు మానవుడు. కూడు, గూడు, గుడ్డ... ప్రతి మనిషికీ నిత్యావసరాలు. ఈ మూడు అవసరాలను తీర్చే ఏకైక మార్గం పంట పండించడం. ఆదిమ దశ నుంచి ఆధునిక దశకి వచ్చిన అతడు దానికి వ్యవసాయం అని పేరు పెట్టాడు. కృషి, సాగు లాంటివి దానికి సమానార్థకాలు. వ్యవసాయ సంబంధ పనులు చేసేవారిని రైతు, కర్షకుడు, హాలికుడు, వ్యవసాయదారుడు... ఇలా ఎన్నో పేర్లతో పిలిచారు. పాడిపంటలు ఏ ఆర్థికవ్యవస్థకైనా పునాదుల్లాంటివి.  తొలిసారిగా తన పొలాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసుకోవడం రైతు జీవితంలో ఓ మధుర ఘట్టం. ఇది ఏటా జరుగుతూనే ఉన్న  ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కొత్త పంటకు శ్రీకారం చుడుతూ రైతన్న ఆనందంగా వినిపించే ఓ అద్భుత రాగం ఏరువాక. ఇది సామూహికంగా ప్రతీ జ్యేష్ఠ మాస పూర్ణిమ నాడు జరుపుకునే పండగ. రైతు తొలిసారిగా తన పొలంలో నాగలి దున్ని తన కృషికి శ్రీకారం చుట్టే శుభసమయం ఇది. దీని గురించి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ప్రస్తావించాయి. జానపద సాహిత్యంలో ఏరువాకకు సంబంధించి ఎన్నెన్నో పాటలు, పదాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ప్రజలందరికీ పట్టెడన్నం ఆనందంగా పెట్టే రైతు జీవనశైలికి అద్దంపడుతూ కనిపిస్తాయి. ఏరువాక అనే పదంలోనే తేనె వాగులాంటి ఓ తియ్యదనం...ఓ గొప్ప అనుభూతి దాగిఉన్నాయి. ఏరు అనే పదానికి దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని అర్థం ఉంది. వాక అంటే సాగడం. ఏరువాక నాడు శ్రీకారం చుట్టి శ్రమైక జీవనానికి ఒక సమైక్యగీతికను ఆనాడు పల్లె ప్రజలంతా పాడుకుంటూ కనిపిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు పల్లెపల్లెనా రైతులంతా తమ పశువులను అందంగా అలంకరించి ఉత్సవానికి సిద్ధం చేస్తారు. పొంగలి వండి ఎద్దులకు తినిపిస్తారు. ఈ అలంకరణలో ఎద్దుల కొమ్ములకు రంగులు వేయడం, కాళ్లకు గజ్జలు కట్టడం, మెడ పట్టీలతో అలంకరించడం లాంటి సందడిలో రైతుల ఇళ్లు కోలాహలంగా ఉంటాయి. అదేరోజు సాయంత్రం మంగళవాద్యాలతో ఊరు ఊరంతా ఊరుమ్మడిగా నాగళ్లతో తమ పొలాలవైపు అడుగులేస్తారు. నారపీచుతో ఒకతోరణాన్ని కట్టి ఎద్దులను అదిలించే చర్నాకోలుతో ఆ తోరణాన్ని కొట్టి దాని నుంచి వచ్చే నారను శుభసూచికంగా రైతులు తమ ఇళ్లకు తీసుకెళ్తారు. అలాగే పొలం దున్నేటప్పుడు ఎద్దుతో సమానంగా తాను అడుగులేయటం పశువుల విషయంలో రైతుకు ఉన్న ప్రేమానురాగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇతర పండగలు ఎవరికి వారు తమ ఇళ్లలో చేసుకున్నట్లు కాక అందరూ ఒకేరోజు ఒకే సమయంలో కలసికట్టుగా కదలి పొలాలకు వెళ్లటం ఒక సుందర దృశ్యంగా ఉంటుంది.
అన్ని కాలాల్లో...
ఈ పండగ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ రకరకాల పేర్లతో జరుగుతూ ఉంటుంది. కర్ణాటకలో కారుణిపబ్బం అంటారు. సంస్కృత భాషలో ‘ఉద్వృషభ యజ్ఞమని’ పూర్వకాలం చేసేవారు. జైమినీయ న్యాయమాలా గ్రంథంలో హలాకాధికరణంలో దీనిని గురించి ప్రస్తావన ఉంది. ఉద్వృషభ యజ్ఞం పేరుతో ఉత్తరభారతదేశంలో జ్యేష్ఠ పూర్ణిమ నాడు జరపటం ఆచారంగా వస్తోంది. దీనినే ‘అనడుత్సవం’ అని కూడా అంటారు. ఈ ఉత్సవ ప్రస్తావన ఆధర్వణ వేదంలో ఉంది.
విష్ణుపురాణంలో ఈ వేడుకను సీతాయజ్ఞం పేరుతో పిలిచారు. సీతాయజ్ఞం అంటే శ్రీరామచంద్రుడి భార్య సీతమ్మ తల్లి చేసిన యజ్ఞమని అర్థం కాదు. సీత అంటే నాగేటిచాలు అని అర్థం. యజ్ఞం అనేది ఓ పవిత్ర కార్యం. నాగలితో పొలాన్ని దున్నే ఓ పవిత్ర యజ్ఞమనే అర్థంలో మాత్రమే ఇది ప్రస్తావనలో ఉంది. జనక మహారాజుకు నాగేటిచాలులో దొరికిన శిశువు కనుక  సీత అని పేరు పెట్టారు. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్షరుతువు ఆరంభం కాగానే కర్షకులకు లాంఛనంగా ఒక బంగారు నాగలిని ఇచ్చేవారని లలితవిస్తరం గ్రంథంలో ప్రస్తావన కనిపిస్తుంది. అలాగే హాలుడి గాథాసప్తశతిలో కూడా ఈ పండగ నేపథ్యం దర్శనమిస్తుంది. 
అందరొక్కటై...
ఏరువాక పున్నమిను పండగగా చేసుకోవడం వెనుక ఉన్న అంతర్యం సామాజిక ప్రయోజనంతో ముడిపడి ఉంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవసాయ పనులు చేసుకోవడం కాకుండా అందరూ ఒక మాటగా ఒకే సమయంలో పనులను మొదలు పెడితే ఆ ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఐకమత్యంతో సేద్యంలో ఎన్నెన్నో అద్భుత ఫలితాలను సాధించేందుకే ఇలాంటి ఆచారం ప్రారంభమైందని సామాజిక పరిశీలకులు చెబుతున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ నాటికి నైరుతి రుతుపవనాలు కాస్త అటుఇటుగానైనా దేశమంతటా విస్తరిస్తాయి. వానలు పడి వ్యవసాయ పనులకు అదునుగా ఉంటుంది. దుక్కి దున్నడానికి ఇది చాలా మంచి సమయం. కనుకనే జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమిగా స్థిరీకరించారు పెద్దలు.
హలాయుధుడు..
నాగలి వ్యవసాయానికి గుర్తు. అంతటి ఉత్తమ పనిముట్టు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడి చేతిలో ఆయుధంగా ఉండటాన్ని గమనిస్తే భారతీయ సనాతన సంప్రదాయంలో వ్యవసాయం ఎంతో పవిత్రమైన కార్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పండగకు యజ్ఞం అనే నామాతరం కూడా ఉండటాన్ని గమనిస్తే సేద్యం ఆషామాషీగా చేసేది కాదని ఓ పద్ధతి ప్రకారం నిర్వహించే పవిత్ర కార్యమని సమాజం అంతటికి తెలియజెప్పేందుకే ఏరువాక పున్నమ అవతరించిందని అనిపిస్తుంది.
వేదాల్లో వ్యవసాయం
వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో వ్యవసాయం, వ్యవసాయదారులకు సంబంధించిన అనేక విషయాలు చర్చించారు. అగ్ని - వాయు పురాణాలు, నారద స్మృతి, విష్ణు ధర్మోత్తర మొదలైన ధర్మశాస్త్ర గ్రంధాల్లో వ్యవసాయం గురించి ఉంది.  సింధు నాగరికత కాలంలో ప్రతి నగరంలోనూ తప్పనిసరిగా ధాన్యాగారాలు ఉండేవి. ఆ రోజుల్లో రైతులు ఉత్పత్తి చేసిన పంటలని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. రైతు కష్టానికి తగిన ఫలితాన్నివ్వడం మన సంస్కృతిలో భాగమనడానికి ఇదో నిదర్శనం.
క్రీస్తు పూర్వం 321-296 మధ్యకాలంలో రాజాస్థానాల్లో సీతాధ్యక్షుడు అనే పదవి ఉండేదని కౌటిల్యుడు రాసిన అర్ధశాస్త్రంలో వివరించారు. ఇక్కడ సీత అంటే నాగేటి చాలు అని అర్థం. వ్యవసాయ సంబంధిత సమాచారం, రైతులకు సూచనలు-సలహాలు- శిక్షణతో పాటు పండిన పంటను తాత్కాలిక- శాశ్వత పద్ధతుల్లో నిల్వ చేసుకునేందుకు మార్గదర్శకాలు-సూచనలు ఆ పదవిలో ఉన్నవారు వివరించేవారు.
సంప్రదాయబద్ధంగా జరుపుకునే వ్రతాలలో పూర్వం ఇంద్రవ్రతం కూడా ఉండేది. ఇంద్రుడి అధీనంలో మేఘాలు ఉంటాయని, కర్షకులకు సమయానికి తగట్టుగా ఇంద్రుడు వర్షం కురిపించటం కోసం మేఘాలను పంపుతుంటాడని పురాణాలు వివరిస్తున్నాయి.
వరాహ మిహిరుడు రాసిన బృహత్సంహిత వ్యవసాయ విజ్ఞానం తెలిపే పరిపూర్ణ గ్రంథÅ]ం. ఇతడు ఖగోళ శాస్త్రవేత్త కావడంతో గ్రహగమనాల ఆధారంగా వర్షం కురిసే పరిస్థితులు, సుభిక్ష-దుర్భిక్షాలు ఏర్పడే తీరు, వాటిని నివారించడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? తదితర విషయాలన్నీ ఆ బృహత్‌ గ్రంథంలో వివరించారు. పంటకి బలాన్నిచ్చే వనరుల వివరాలు, వాటి వినియోగానికి సూచనలు, రుతుపవనాల రాకను లెక్కించే పధ్ధతులు, సుగంధ పరిమళాలు వెదజల్లే (నేటి బాస్మతి)వరి ధాన్యపు రకాల సాగు విధానం లాంటివీ అందులో ఉన్నాయి.
క్రీస్తు శకం 1 వ శతాబ్దం నాటికి పరాశరుడు రూపొందించిన కృషి పరాశరం ఆనాటి వ్యవసాయ సర్వస్వం. ఎలాంటి భూమిలో-ఏ ప్రాంతంలో  ఏ పంట పండించాలి?,ఏ పంటకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?,ఎంత జనాభాకి ఎంత పరిమాణంలో పండించాలి?, అవసరానికి మించి పండించకూడని పంటలేవి?, అలా పండిస్తే కలిగే నష్టాలేంటి?,  నేలకి సారాన్ని, పంటకి అనుకూల పరిస్థితుల్ని ఎలా కల్పించుకోవాలి?, విత్తనాలని ఎలా తయారు చేేేసుకోవాలి?, వర్షాన్ని ఎలా కొలవాలి?వంటి అనేక విషయాలు కృషి పరాశరంలో స్పష్టంగా చర్చించారు. వాటితో పాటు భూమి స్వభావం, దాన్ని దున్నే విధానం, దానికి అనుసరించాల్సిన పద్ధతులు, ఎద్దులు-ఇతర వ్యవసాయ సంబంధిత పశువుల స్వరూప స్వభావాలు స్పష్టంగా వివరించిన గ్రంథమిది.
- అయ్యగారి శ్రీనివాసరావు,  డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు,  కప్పగంతు రామకృష్ణ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)