రైతు సంఘం జిందాబాద్‌! ()(_Eenadu Mag_15/07/12


రైతు సంఘం జిందాబాద్‌!



రైతు వ్యూహకర్త కావాలి. మార్కెటింగ్‌ మాంత్రికుడి అవతారం ఎత్తాలి. ఆర్థిక నిపుణుడిలో పరకాయప్రవేశం చేయాలి. డిమాండ్‌-సప్త్లె సూత్రాన్ని నరనరానా జీర్ణించుకోవాలి. అప్పుడే, లాభాలపంట పండించగలడు. 'అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌' రైతన్నలకు నేర్పుతున్న పాఠం ఇదే!
రైతు ఎడ్లబండే ఎందుకు తోలాలి? దర్జాగా ట్రాక్టరు నడపొచ్చుగా! సేద్యగాడు డొక్కు మోపెడ్‌ మీదే ఎందుకు తిరగాలి? కారు కొనుక్కోవచ్చుగా!
రైతన్న నివాసం పెంకుటిల్లేనా? ముచ్చటైన మేడ కట్టుకోవచ్చుగా!
కృషీవలుడికి ఎప్పుడూ నష్టాలేనా? ఉద్యోగిలా నెలకో యాభైవేలు సంపాదించుకోవచ్చుగా!
ముత్తాత తాతకూ, తాత నాన్నకూ, నాన్న బిడ్డకూ నేర్పిన పద్ధతుల్నే ఇప్పటికీ పాటించాలా? అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చుగా!అవును, ఎందుకు సాధ్యం కాదు? అయితీరుతుందని నిరూపించడానికే 'అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌' ప్రాణంపోసుకుంది. రైతు బతుకంటే పుట్టెడు కష్టాలు కానేకాదు... పుట్లకొద్దీ ధాన్యపురాశులని చాటిచెప్పింది. దాదాపు రెండువేల ఎకరాల్లో 'అభినవ్‌' సేద్యం నడుస్తోంది. ఒక్క పుణె క్లబ్‌లోనే 250 మంది సభ్యులున్నారు. మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలతోపాటు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనేక బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. పరోక్షంగా వేలమంది రైతులు సలహాలూ సూచనలూ సాంకేతిక సహకారాలూ అందుకుంటున్నారు.
'అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌' వ్యవస్థాపకుడు ధ్యానేశ్వర్‌ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. పుణె దగ్గర్లోని హింజేవాడి సొంతూరు. తండ్రి పదహారణాల రైతు. సేద్యం తప్ప మరో సంపాదన మార్గం తెలియని మనిషి. గిట్టినా గిట్టకపోయినా, పంట వచ్చినా రాకపోయినా వ్యవసాయం చేస్తూనే వచ్చాడు. ఎప్పుడో అవసరం కొద్దీ తీసుకున్న ఇరవైవేల అప్పు... లక్షా నలభైవేలై కూర్చుంది. పంటలేమో... అంతంతమాత్రం! ఉన్న పదిహేను ఎకరాల్లో ఐదెకరాలు అమ్మక తప్పలేదు. అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. జేబు ఖాళీ అయిపోయింది. ఓ దశలో పూటగడవడం కూడా కష్టమైంది. అల్లుడు దారిచూపకపోతాడా అన్న ఆశతో ఒక్కగానొక్క కొడుకును పెద్దకూతురి ఇంటికి పంపాడు. అప్పటికి ఆ కుర్రాడు పదోతరగతి చదువుతున్నాడు. అక్కయ్య ఇంట్లో పశువుల కాపరి అవతారం ఎత్తాడు ధ్యానేశ్వర్‌. తీరిక సమయంలో టైపింగ్‌ నేర్చుకునేవాడు. చదువు ఆగిపోయినా, పస్తుల బాధ తప్పింది. అయినా, మనసంతా అమ్మానాన్నల మీదే. ఎలా బతుకుతున్నారో, ఏం తింటున్నారో అన్న బెంగ. టైపు పరీక్ష ఫలితాలు వెల్లడైనరోజే... 'నా మిత్రుడు పుణెలో పెద్ద ఆర్కిటెక్ట్‌. తన దగ్గర టైపిస్టు ఉద్యోగం ఖాళీగా ఉంది. ఓసారి వెళ్లిరా...' అని చెప్పారు బావగారు. వెంటనే బయల్దేరాడు ధ్యానేశ్వర్‌. రెండ్రోజుల్లో వచ్చి చేరమన్నాడు ఆ పెద్దమనిషి. జీతం... రెండువందలు! అమ్మానాన్నలు సంతోషించారు. సొంతూరు హింజేవాడికి పుణె మరీ దూరమేం కాదు. సైకిలు మీద గంటన్నర ప్రయాణం. పొద్దున్నే బయల్దేరి వెళ్లేవాడు. ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి దాటేది. ఆ శ్రమ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కీబోర్డు మీద పట్టు రావడంతో... చకాచకా పనులు పూర్తిచేసుకునేవాడు. ఆ చురుకుదనం చూసి యజమాని ముచ్చటపడ్డాడు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సులో చేర్పించాడు. కొత్త అర్హతతో జీతం పెరిగింది. రెండువందలతో బతికిన వాడికి నెలకు అయిదు వేలంటే..పెద్దమొత్తమే! ముంబయి, పుణె నగరాల్లోని డొమినోస్‌ పిజ్జా, వెంకీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ దుకాణాల ఇంటీరియర్‌ డిజైనింగ్‌ బాధ్యతలు తనే చూసేవాడు. పొదుపు చేసుకున్న డబ్బుకుతోడు మరికాస్త అప్పుచేసి మిగిలిన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లూ చేశాడు. మంచి సంబంధం రావడంతో తనూ ఓ ఇంటివాడు అయ్యాడు.
బాధ్యతలు తీరిపోయాయి. బరువు తగ్గింది. జీతం పెరిగింది. అయినా ఏదో అసంతృప్తి. ధ్యానేశ్వర్‌కు సేద్యమంటే ప్రాణం. ఏ కాస్త తీరిక దొరికినా వ్యవసాయ రంగంలోని కొత్తకొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఎన్నో ఆలోచనలు...
'ఏ రైతూ సంతోషంగా లేడు. అప్పులతో కుదేలైపోతున్నాడు. బాధ్యతలతో కుంగిపోతున్నాడు. అతనికున్న ఆస్తీ ఆధారం... పొలమే! మరోదారిలేక ..తెగనమ్ముతున్నాడు. పొలంలేని రైతంటే - ఆత్మలేని శరీరమే - జీవచ్ఛవమే! ఎవరికీ అలాంటి పరిస్థితి రాకూడదు. చిన్న కమతాలు, నిధుల కొరత, ఆధునిక పద్ధతుల మీద అవగాహన లేకపోవడం, మార్కెటింగ్‌ నైపుణ్యం కొరవడటం... భారతీయ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు'
'రైతు వ్యవసాయాన్ని వ్యవసాయంగానే చూస్తాడు. వ్యాపారమని అనుకోడు.పంటను పంటగానే చూస్తాడు. సరుకుగా భావించడు. కష్టమే కాని, వ్యూహం ఉండదు. శ్రమే కాని, శాస్త్రీయత కనిపించదు''కార్ల వ్యాపారికి లాభాలు వస్తాయి. మద్యం వ్యాపారికి లాభాలు వస్తాయి. ఐస్‌క్రీమ్‌ వ్యాపారికి కూడా లాభాలు వస్తాయి. రైతుకు మాత్రం పెట్టుబడి డబ్బు తిరిగొచ్చినా గగనమే. కార్లు లేకపోయినా బతకొచ్చు. మద్యం లేకపోయినా బతకొచ్చు. ఐస్‌క్రీమ్‌ లేకపోయినా బతకొచ్చు. కానీ తిండిగింజలు లేకపోతే బతకలేం. కూరగాయలు లేకపోతే బతకలేం. అలాంటప్పుడు, నిత్యావసరాల్ని పండించే రైతుకు ఇన్ని కష్టాలెందుకు?'
పండించిందేదో అమ్మడం కాదు.
గిరాకీ ఉన్నదే పండించాలి.
సమస్య..పంటలో లేదు.
రైతులో ఉంది.
పంటకు గిరాకీ లేకపోవడం కాదు, ఆ గిరాకీని వ్యాపారంగా మార్చుకునే వ్యూహం కరవైంది. కలిసి పండించడం ద్వారా, కలిసి విక్రయించడం ద్వారా లోపాన్ని సరిదిద్దుకోవచ్చని ధ్యానేశ్వర్‌ నిశ్చితాభిప్రాయం. తనే ఆ బాధ్యత తీసుకోవాలనుకున్నాడు.
తోటిరైతులు తనను నమ్మాలంటే, ముందుగా తానేమిటో నిరూపించుకోవాలి. మరో ఆలోచనకు తావివ్వకుండా, ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పొదుపు డబ్బులోంచి, చెల్లెళ్ల పెళ్లికి చేసిన 70వేల అప్పు తీర్చేశాడు. చేతిలో ఇంకాస్త నగదు మిగిలింది. విదేశీ అలంకరణ పుష్పాలకు మంచి గిరాకీ ఉందని తెలిసింది. తన పొలంలో వాటిని పండించాలని నిర్ణయించాడు. సాగు విధానం తెలుసుకోడానికి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యాడు. పెట్టుబడికి ఐదులక్షల దాకా అవసరం అవుతుందని తేలింది. తన దగ్గర అంత డబ్బులేదు. ఓ ప్రాజెక్ట్‌ రిపోర్టు తయారు చేసి బ్యాంకువారికి ఇచ్చాడు. మేనేజరుకు ఆ ప్రణాళిక చాలా నచ్చింది. కోరినంత రుణం మంజూరు చేశాడు. పద్నాలుగు నెలల్లో..పూల విక్రయం ద్వారా నాలుగు లక్షలా ఎనభై ఎనిమిదివేలు సంపాదించాడు ధ్యానేశ్వర్‌. నేషనల్‌ హార్టీకల్చర్‌ బోర్డు వారు లక్షా ఇరవై రెండువేల రూపాయలు సబ్సిడీగా ఇచ్చారు. మొత్తం అప్పు తీర్చేశాడు. బ్యాంకువాళ్లు తెగ సంతోషించారు. అన్నీపోగా ఎంతోకొంత లాభం వచ్చింది. అదంతా చూసి.. ఇరుగుపొరుగు రైతులకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఏడాది వూళ్లోని రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. తన ఆలోచన పంచుకోడానికి ఇదే సరైన సమయమని ధ్యానేశ్వర్‌ భావించాడు. మనసులోని మాట చెప్పాడు. 'ఫార్మర్స్‌ క్లబ్‌' ప్రతిపాదనకు మిశ్రమ స్పందన వచ్చింది. అతికష్టం మీద ఓ పదిహేడుమంది సిద్ధపడ్డారు. 2004, పంద్రాగస్టునాడు అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌ ప్రారంభమైంది. బ్యాంకువారిచ్చిన పది లక్షల అప్పుతో... సరికొత్త సేద్యం మొదలైంది.
నాటి నుంచి... ధ్యానేశ్వర్‌ అంటే... అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్బే!
కలసి మెలసి...
'ఏం పండించాలి?' అన్నది మన ఇష్టం కాదు. మార్కెట్‌ను బట్టి నిర్ణయించాలి. 'ఎప్పుడు పండించాలి?' అన్నది కూడా 'గిరాకీ-సరఫరా' సూత్రం ప్రకారమే జరగాలి. కూరగాయలకూ పండ్లకూ అలంకరణ పుష్పాలకూ పుణె, ముంబయి, ఢిల్లీ తదితర నగరాల్లో చాలా గిరాకీ ఉంది. అందుకే, క్లబ్‌ ఆ పంటల్నే ప్రోత్సహించింది. ఎవరి పొలంలో వారు సేద్యం చేసుకుంటారు. కానీ విత్తనాలూ ఎరువులూ క్రిమిసంహారకాలూ కలిసే కొంటారు. దీనివల్ల బేరమాడే శక్తి వస్తుంది. పంటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని క్లబ్బే అందిస్తుంది. పంట చేతికిరాగానే.. ఆ సరుకంతా నేరుగా పుణెలోని 'అభినవ్‌' కార్యాలయానికి తరలిస్తారు. అక్కడున్న స్వయంసహాయక బృందాల మహిళలు నాణ్యత ప్రకారం సరుకును విభజిస్తారు. శుభ్రంచేసి నిల్వచేస్తారు. గిరాకీని బట్టి మార్కెట్‌కు పంపుతారు. పుట్టీపుట్టగానే... అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌ ఇంత వ్యవస్థీకృతం కాలేదు. అంచెలంచెలుగా ఎదిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంది.
క్లబ్‌ కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ధ్యానేశ్వర్‌ స్వయం సహాయక బృందాల్ని ప్రోత్సహించాడు. పంట గిడ్డంగికి చేరడం మొదలు మార్కెట్‌కు వెళ్లేదాకా... అన్ని బాధ్యతలూ ఆ బృందానివే. ప్రస్తుతం నూటయాభైదాకా స్వయంసహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎంతోమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్నవారికి... వసతి, కూరగాయలు, పాలు పూర్తిగా ఉచితం. పిల్లల్ని కూడా క్లబ్బే చదివిస్తుంది. రోజువారీ వ్యవహారాల్లో సహకరించడానికి అరడజనుమంది ఎంబీయే పట్టభద్రులను నియమించుకున్నారు. వ్యవసాయశాస్త్రంలో పట్టా అందుకున్న యువతీయువకుల్ని క్షేత్రస్థాయి అధికారులుగా తీసుకున్నారు. కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించారు. ఎవరి పంటకు ఎంత ధర వచ్చింది, పెట్టుబడి పోనూ ఎంత లాభం వచ్చింది..వగైరా లెక్కలు పక్కాగా ఉంటాయి. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగిపోతాయి. క్లబ్‌లో రోజుకు వేయి రూపాయలు సంపాదించే రైతులు ఉన్నారు. పదివేలు సంపాదించే రైతులూ ఉన్నారు.దళారులకు దూరం..
రైతుకు ధర మీద అవగాహన ఉండదు. దళారీ చెప్పిందే నిజమనుకుంటాడు. ఆకలితో అలమటిస్తున్న వారికి బేరమాడే శక్తి ఎలా వస్తుంది? ఏదో ఓ ధరకు పంట అమ్ముడుపోతే చాలనుకునే పరిస్థితి. రైతుల్ని మధ్యవర్తుల వలలోంచి బయటికి తీసుకురావాలన్నది 'అభినవ్‌' ప్రధాన లక్ష్యం. అప్పుడప్పుడే మాల్స్‌ హడావుడి మొదలైంది. కార్పొరేట్‌ దిగ్గజాలు రిటైలింగ్‌ రంగంలోకి వస్తున్నారు. ధ్యానేశ్వర్‌ నేరుగా వెళ్లి వారితో మాట్లాడాడు. దళారులు చెల్లిస్తున్న ధర కంటే..కనీసం 30 శాతం ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాకపోతే, రెండుమూడు నెలల సమయం అడిగారు. కొంతకాలం వేచి ఉండగలిగే రైతులకు ఇది మంచి బేరమే. కానీ మిగిలినవారి మాటేమిటి? హోటళ్ల మీదా హాస్టళ్ల మీదా దృష్టిపెట్టాడు. భారీమొత్తంలో ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. కోరినన్ని కూరగాయలను కోరుకున్న సమయానికి సరఫరా చేయడం కత్తిమీద సామే. ముందు, గిరాకీకి సరిపడా సరఫరా పెంచాలి. అంటే, దిగుబడి పెరగాలి. సేద్యంలో అనిశ్చితి తొలగిపోవాలి.
సంప్రదాయ సేద్యంలో పెట్టుబడి ఎక్కువ. ఎప్పుడూ వాతావరణంతో జూదమే. తక్కువ పెట్టుబడితో, ఎక్కువ దిగుబడి సాధించడంపై దృష్టిపెట్టింది అభినవ్‌ క్లబ్‌. వాతావరణంలోని ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోడానికి టెక్నాలజీని ఆశ్రయించింది. 'గ్రీన్‌హౌస్‌', 'షేడ్‌నెట్‌ హౌస్‌' వంటి వాటిని రైతులకు పరిచయం చేసింది. దీనివల్ల..తొలిదశలో ఖర్చు ఎక్కువైనా, దీర్ఘకాలంలో చాలా ఉపయోగం ఉంటుంది. పంటపొలాలు ఏడాదికి పదకొండు నెలలు ఖాళీగా ఉండవు. నెలరోజులు మాత్రమే విశ్రాంతి. మునుపెన్నడూ రానంత దిగుబడి వస్తోంది. రకరకాల మార్కెటింగ్‌ వ్యూహాలతో... ఆ పంటల్ని నగరాలకు తరలిస్తోంది అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌.డయల్‌ యువర్‌ వెజిటబుల్స్‌...
నేరుగా వినియోగదారుడికే కూరగాయలు వెళ్తే..ఎలా ఉంటుంది? రైతుల నుంచి కొనే చిన్న దళారీ ఉండడు. చిన్నదళారీ నుంచి కొనే పెద్ద దళారీ ఉండడు. సూపర్‌ మార్కెట్లవాళ్లూ కూరగాయల వ్యాపారులూ అసలు ఉండరు. మొత్తం రెండు అంచెలే! ఇద్దరూ గరిష్ఠ ప్రయోజనం పొందుతారు. రైతుకు గిట్టుబాటు ధర దొరుకుతుంది. వినియోగదారుడికి చవగ్గా కూరగాయలు అందుతాయి. 'అభినవ్‌' ప్రయోగం విజయవంతమైంది. పుణెలోని వందలాది అపార్ట్‌మెంట్లకు కూరగాయలు వెళ్తున్నాయి. నాలుగైదువేల కిలోల సరుకు దళారుల ప్రాబల్యమే లేకుండా చేరాల్సినవారికి చేరుతోంది. స్వయం సహాయక బృందాల మహిళలు శుభ్రంగా కడిగి ప్యాక్‌ చేస్తారు. వాహనాల్లో వాటిని తరలించి... జాబితా ప్రకారం సరఫరా చేస్తారు. మార్కెట్‌తో పోలిస్తే ధర చాలా తక్కువ. తాజాదనానికి తిరుగులేదు. దీంతో అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌ కూరగాయలకు ఆదరణ పెరుగుతోంది. గుడ్లు, బియ్యం, పప్పుదినుసులు కూడా సరసమైన ధరకు అందిస్తున్నారు. డిమాండ్‌ ఎక్కువకావడంతో... సేంద్రియ పద్ధతుల్లో ప్రత్యేకంగా మేలురకం వరి పండిస్తున్నారు అభినవ్‌ రైతులు.
పాడి, పంట - వేరువేరు కాదు! ఒకదానితో ఒకటి ముడిపడ్డాయి. ఫార్మర్స్‌ క్లబ్‌ పాడిని కూడా ప్రోత్సహిస్తోంది. నిజానికి, పట్టణాల్లో నాణ్యమైన పాలకూ పాల ఉత్పత్తులకూ చాలా గిరాకీ ఉంది. 'అభినవ్‌' బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ప్రారంభించారు. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంది. రోజూ దాదాపు ఐదువేల లీటర్ల దాకా విక్రయిస్తున్నారు.
పెరటి రుచులు...
ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఎన్ని పెద్దనోట్లు ఖర్చుపెట్టినా చిన్న కూరగాయల సంచీ కూడా నిండటంలేదు. మధ్యతరగతి జీవికి పళ్లెంముందు కూర్చుంటే కడుపునిండిపోదు, మండిపోతుంది - ఆ ధరల్ని తలుచుకుని. ఈ పరిస్థితుల్లో... మీ కూరగాయలు మీరే పండించుకోండి! అంటూ 'అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌' సగటు మనిషికి చల్లని కబురు చెబుతోంది. అవును, ఎందుకు పండించుకోకూడదు? బాల్కనీ, టెర్రస్‌, పార్కింగ్‌ ఏరియా, పెరడు... ఎక్కడో ఓ చోట, ఎంతోకొంత జాగా ఉంటే చాలు. విత్తనాలు, మట్టి, కుండీలు, చిన్నాచితకా పనిముట్లు... అన్నీ క్లబ్బువాళ్లే ఇస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బోధిస్తారు. వంటింటి వ్యర్థాలనే ఎరువుగా వాడుకోవచ్చు. వంకాయ, కాలీఫ్లవర్‌, బీన్స్‌, క్యారెట్‌, క్యాబేజీ... ఏమైనా పండించుకోవచ్చు. నిశ్చింతగా వండుకుతినొచ్చు. 'ఎంతైనా, మన పెరట్లో పండిన కూరగాయల రుచే వేరు. ఆహా! ఎంత తాజాగా ఉంటాయి! ఎంత కమ్మగా ఉంటాయి..' అంటూ పొంగిపోతారు రత్నా జయ్‌దేవ్‌ అనే గృహిణి. ఈ ప్రయోగం కూడా విజయవంతమైంది. దాదాపు మూడువందల ఫ్లాట్లలో పెరటి పంటలు పండుతున్నాయి. రోజుకు పదిహేను నిమిషాలు కేటాయించగలిగితే... వారానికి కనీసం రెండు కిలోల కూరగాయలు పండించుకోవచ్చని చెబుతారు ఫార్మర్స్‌ క్లబ్‌ సభ్యురాలు యోగిత. ఓ ఏడాదిదాకా నిర్వహణ బాధ్యత క్లబ్బువాళ్లదే. దీని ద్వారా వచ్చే నిర్వహణ రుసుము కూడా 'అభినవ్‌'కు ఓ ఆదాయ వనరే.'సేంద్రియ' మంత్రం
రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. అందులోనూ పుణె పరిసర ప్రాంతాల్లో కొత్తకొత్త ఐటీ కంపెనీలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు..ఆర్గానిక్‌ రకాల కోసం కొంత ఎక్కువ చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి కస్టమర్స్‌ కోసమే అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించింది. చూడముచ్చటైన అలంకరణతో చిన్నచిన్న దుకాణాల్ని తెరిచింది. మిగతా కూరగాయలతో పోలిస్తే ధర పదిహేను శాతం దాకా ఎక్కువగా ఉంటుంది. 'అభినవ్‌' ఆర్గానిక్‌ ఫలాల్నీ పండిస్తోంది. ఈ ఉత్పత్తులకు 'ఎకోసర్ట్‌' ధ్రువీకరణ కూడా వచ్చింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి పట్టణాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు.
'అభినవ్‌' ఆర్గానిక్‌ చిరుతిళ్ల వ్యాపారాన్ని నడుపుతోంది. ధాన్యాల సూప్‌, కొత్తిమీరా అల్లం టీ, చెర్రీ టమోటా చాట్‌, ఉడికించిన మొక్కజొన్న గింజలు.. ఈ స్టాల్స్‌లో దొరుకుతాయి. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్వయం సహాయక బృందాలదే. మహిళలోని సృజనాత్మకకోణాన్ని, పూలసాగుకు జోడిస్తే... ఎలా ఉంటుంది? అద్భుతమైన వ్యాపార ఆలోచన! ఐటీ కార్యాలయాల్లో పుష్పాలంకరణకు సంబంధించి... 'అభినవ్‌' అనేక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది.విదేశీ కూరగాయలు...
నియంత్రిత వాతావరణంలో విదేశీకూరగాయల్ని పండించడం సాధ్యమే? ఏ అమెరికాలోనో సాగుచేయడానికి అయ్యేఖర్చులో పావుభాగం కూడా ఇక్కడ ఉండదు. ఎందుకంటే, మన దగ్గర శ్రమ చాలా చౌక. విదేశాలతో పోలిస్తే... సాంకేతిక పరిజ్ఞానం, ఎరువుల ధరలూ తక్కువే.దిగుమతి ఖర్చులు ఉండవు. విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే గోవాలోని కొన్ని రెస్టరెంట్లకు వాటిని విక్రయించడం ద్వారా... ఈ వ్యాపారంలోకి వచ్చింది అభినవ్‌. కాప్సికమ్‌, బేబీకార్న్‌, చైనీస్‌ క్యాబేజీ తదితర రకాల్ని పండిస్తున్నారు రైతులు. ఇంట్లోనే విదేశీ వంటలు వండుకోవాలనుకునేవారు కూడా ఈ ఖరీదైన కూరగాయల్ని ఇష్టంగా కొంటున్నారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. 
కూరగాయల్ని నేరుగా అపార్ట్‌మెంట్లకే సరఫరా చేయడం, బియ్యం-పప్పు దినుసుల వ్యాపారం, పాల వ్యాపారం, పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం, ఆర్గానిక్‌ సాగు, పూల అలంకరణలు, శిక్షణ కార్యక్రమాలు... రకరకాల మార్గాల్లో అభినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌ సభ్యులు నెలనెలా నలభై నుంచి యాభైవేల దాకా సంపాదించుకుంటున్నారు. 'క్లాస్‌వన్‌ స్థాయి అధికారి జీతం కంటే, నా సంపాదనే ఎక్కువ' సగర్వంగా చెబుతాడు టమోటా రైతు బాలాజీరావ్‌. చక్కని ఇల్లు, వాహనం, బ్యాంక్‌ బ్యాలెన్స్‌... ఆ చూడముచ్చటైన జీవితాలు సేద్యానికి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాయి.
పొలాల్ని అమ్ముకోవద్దు!
- ధ్యానేశ్వర్‌
పొలం... రైతు ఆస్తి, ఆత్మాభిమానం! రియల్‌ ఎస్టేట్‌ భ్రమల్లోపడి.. బంగారం లాంటి భూమిని అమ్ముకోకండి! నిజంగా, భూమి బంగారమే. మా పల్లె పరిసరాల్లో ఐటీ సంస్థలు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షలకు లక్షలు వచ్చేస్తుండటంతో చాలామంది అమ్ముకున్నారు. నడమంత్రపు సిరి... ఎక్కువకాలం నిలబడదు. ఏవో వ్యసనాలు చుట్టుముడతాయి. ఆ డబ్బు కరిగిపోడానికి ఎంతో సమయం పట్టదు. మా వూళ్లోనూ అదే జరిగింది. ఉన్నదంతా పోగొట్టుకుని తమ పొలాల్లో నిర్మించిన భవనాలకే కాపలాదార్లుగా పనిచేస్తున్నవారూ ఉన్నారు. ఆ పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు. సేద్యానికి కష్టమే కాదు, తెలివితేటలూ అవసరం. వందల ఎకరాలు అక్కర్లేదు. ఒకటి రెండెకరాలు చాలు... దర్జాగా బతకొచ్చు. ప్రభుత్వాలకు నా విన్నపం ఏమిటంటే..రైతులకు సబ్సిడీలు అవసరం లేదు. రుణ మాఫీలూ అవసరం లేదు. చక్కని రవాణా సౌకర్యం కల్పించండి. కోతల్లేని విద్యుత్‌ ఇవ్వండి. అవినీతిలేని పాలన వ్యవస్థను ప్రసాదించండి. అంతకు మించి మేం ఏమీ అడగం!
రైతులకు పాఠాలు...
భినవ్‌ ఫార్మర్స్‌ క్లబ్‌ రైతులకు పాఠాలు చెబుతోంది. శిక్షణ శిబిరంలో వ్యవసాయ వ్యాపారంలోని ప్రధాన అంశాలన్నీ బోధిస్తారు. మార్కెట్‌ను ఎలా అధ్యయనం చేయాలో చెబుతారు. గిరాకీని ఎలా పసిగట్టాలో నేర్పుతారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తారు. ఒక్క మహారాష్ట్ర నుంచే కాదు..అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, గుజరాత్‌, ఒడిషా తదితర రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడికొస్తారు. ఇది మూడురోజుల శిక్షణ కార్యక్రమం. రెండురోజులు థియరీ, మూడోరోజు క్షేత్ర పర్యటన. బ్యాంకు రుణం పొందడానికి ప్రాజెక్టు రిపోర్టు ఎలా తయారు చేయాలన్నదీ వివరిస్తారు. ఫీజు మూడువేల రూపాయల దాకా ఉంటుంది. 'ప్రతిరైతూ రోజుకు ఎకరానికి వేయి రూపాయలైనా సంపాదించాలన్నది మా లక్ష్యం' అని చెబుతారు అభినవ్‌ శిక్షణ విభాగం ప్రతినిధులు. (ఫోన్‌: 09422005569/020-20270666)
* * *
రైతు... రాజు కావచ్చు, కాకపోవచ్చు.
కానీ, బిజినెస్‌మాన్‌... అయితీరాల్సిందే!
వ్యవసాయ రంగానికి ధ్యానేశ్వర్‌ చెబుతున్న 'అభినవ్‌' వేదమిది!



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)