Interview_Mr. Bujjayi

బడికెళ్లలేదు. పాఠాలు చదువుకోలేదు. నాన్న వెనకాలే సాహితీసభలకు వెళ్లడం, నాన్న పక్కన కూర్చుని వందల మైళ్లు ప్రయాణించడం... ఇదే ఆయన విద్యాభ్యాసం. ఆ అనుభవాల్లోనే చదువులలోని సారమెల్లా చదివానంటూ 'ఫాదర్స్‌ డే' సందర్భంగా గుండెల్లోని నాన్నను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి తనయుడు బుజ్జాయి.
'కృష్ణపక్షం' రోజులవి. భావకవిత్వ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. నాన్నగారు ఆ ఉద్యమ నాయకులు. ఏడాదిలోని పదకొండు నెలలూ ప్రయాణాలే. బళ్లారి నుంచి బరంపురం దాకా.. సుదీర్ఘయాత్రలు. కొత్త కవిత్వాన్ని పరిచయం చేయాలనీ అందులోని మెలకువల్ని విప్పిచెప్పాలనీ ఆయనకెంత తపనో! నాన్నగారు ఇంటిపట్టున ఉన్నదే తక్కువ. అప్పుడే నేను పుట్టాను. పుట్టీపుట్టగానే నాన్నగారి ముందరికాళ్లకు బంధమేశాను. ఇల్లు కదిలితే ఒట్టు. నేనే సర్వస్వం. నా నవ్వు, నా ఏడుపు, నా ఆట, నా మాట... అన్నీ అద్భుతమే తనకు. నా బోసినవ్వులతో ఆయన కడుపు నిండిపోయేది. అసలే పెద్ద కుటుంబం. అంతమంది ఆకలి ఎలా తీరుతుంది? ఆ సంగతి తెలిసినట్టుంది. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు కబురుపెట్టారు. ఆయన నాన్నగారి గురువు. పట్టుబట్టి కాకినాడ కాలేజీలో తెలుగు ఉపాధ్యాయుడిగా వేయించారు. జీతం నలభై రూపాయలు. మా తాతలు...దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, కృష్ణశాస్త్రి (తమ్మన్నశాస్త్రి) పిఠాపురం ఆస్థానకవులు. తమ్మన్నశాస్త్రిగారి అబ్బాయే నాన్నగారు. పెదనాన్న బొజ్జమీద కూర్చుని అమరకోశం చదువుకున్నారు. ఒళ్లో కూర్చుని కావ్యాలు చెప్పించుకున్నారు. ఓసారెప్పుడో 'పెద్దయ్యాక, కొడుకు పుడితే ఎవరి పేరు పెడతావురా?' అనడిగారట. 'మీ పేరే' అని మాటిచ్చారు నాన్నగారు. అందుకే నేను సుబ్బరాయశాస్త్రినయ్యాను. అందరికీ మాత్రం బుజ్జాయినే! ఉమ్మడి కుటుంబంలో గొడవలు రావడంతో ఆస్తుల పంపకాలు జరిగాయి. అది అన్నదమ్ములిద్దరికీ ఇష్టంలేదు. ఆ బాధతోనే ఒకరితర్వాత ఒకరు పోయారు. అప్పటికి నాన్నగారి వయసు పన్నెండు. ఆయన చదువులకు పిఠాపురం రాజావారు చాలా సాయం చేశారు. కాకినాడలో ఇంటర్‌ చదివేరోజుల్లో వెంకటరత్నం నాయుడుగారు ప్రిన్సిపాల్‌. నాన్నగారి మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ. అప్పట్లో డిగ్రీ చదవాలంటే మద్రాసైనా వెళ్లాలి, విజయనగరమైనా వెళ్లాలి. విజయ నగరంలో నాన్నగారి పెద్దక్క కుటుంబం ఉండేది. వాళ్లింట్లో ఉండే చదువుకున్నారు. వాళ్లమ్మాయి సుబ్బలక్ష్మిని చేసుకున్నారు. పెళ్లయి మూడేళ్లు తిరగకముందే, డిస్పెప్సియా అనే వ్యాధి బారినపడ్డారు. ఏం తిన్నా జీర్ణమయ్యేది కాదు. మనిషి శుష్కించిపోయారు. కూర్చోడానికి కూడా ఓపిక ఉండేది కాదు. 'కృష్ణపక్షం' పద్యాలన్నీ గోడలమీద పెన్సిలుతో రాసుకున్నవే. నాన్నగారికి జబ్బు కుదిరింది కానీ, సుబ్బలక్ష్మిగారికి టీబీ పట్టుకుంది. మద్రాసులో వైద్యం చేయించినా ఆమె దక్కలేదు. ఆ విషాదం తర్వాత కవిత్వమే ఆయన ప్రపంచమైపోయింది. వివాహంతో అయినా ఇంటిపట్టున ఉంటారేవో అని రాజహంసతో (మా అమ్మతో) పెళ్లి జరిపించారు. అయినా ఆయన కవితాయాత్రలు ఆగలేదు. తల్లావఝుల, ముద్దుకృష్ణ, నండూరి - వంటి పెద్దల ప్రోత్సాహంతో 'కృష్ణపక్షం' పుస్తక రూపంలో వచ్చింది. అదో సంచలనం. పెనుదుమారం. నాన్నగారి భావకవిత్వ ప్రచారం మరింత జోరందుకుంది. ఆ సమయంలోనే నేను పుట్టాను. ఆ ఉమ్మడికుటుంబంలో అందరి ప్రాణాలూ నా మీదే. కొంతకాలానికి నాకో చెల్లి పుట్టింది. పేరు సీత. ముద్దుగా బొద్దుగా ఉండేది. అంతా 'బుల్లిసీత' అని పిలిచేవారు. ఎందుకంటే, అప్పటికే మా ఇంట్లో నలుగురు సీతలున్నారు. నా ముద్దుల చెల్లెలు మశూచికంతో మరణించింది.
నాన్నగారికి రోగాలంటే భయం. అంటువ్యాధులున్న వారిని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. ఆ ఒక్కకారణంతోనే, వూరొదిలి వెళ్లిన రోజులున్నాయి. నాలుగేళ్ల వయసులో నాకు మశూచికం వచ్చినప్పుడు మాత్రం, ఆయనకా భయాలేవీ గుర్తుకురాలేదు. నన్ను భుజానికెత్తుకుని హాల్లో పచార్లు చేశారు. జోకొట్టి నిద్రపుచ్చారు. మందుల కంటే, నాన్న ప్రేమే బాగా పనిచేసింది. నా ఆరోగ్యం మెరుగుపడ్డాక, మళ్లీ ప్రయాణాలు వెుదలయ్యాయి. ఈ సారి ఒంటరిగా కాదు. వెనకాలే నేను. నన్నెంత ప్రేమగా చూసుకునేవారంటే, 'శాస్త్రి బుజ్జాయికి పాలివ్వడం తప్ప, అన్నీ చేస్తున్నాడు' అని హాస్యంచేసేవారు వెంకటరత్నంనాయుడు గారు.
నా బాల్యం నాన్నగారితోనే గడిచిపోయింది. ఒక్క క్షణం కూడా నన్ను వదల్లేకపోయేవారు. అందుకే స్కూలుకు కూడా పంపలేదు. అసలు ఆ ఆలోచనే రాలేదాయనకు. దానివల్ల మంచే జరిగిందనుకుంటాను. చదువే నా దగ్గరకు వచ్చింది. నాన్నగారి దగ్గరకు వచ్చే సాహితీవేత్తలు, కవులు, నటులు, చిత్రకారులు...అంతకంటే విలువైన పాఠాలు నేర్పించారు. ఆ విద్య పట్టాలకు పదిరెట్లు. ఆ ప్రపంచం విశ్వవిద్యాలయాలకంటే సువిశాలం. విశ్వనాథవారిని పెదనాన్నగారని పిలిచేవాణ్ని. అడివి బాపిరాజుగార్ని బందరు బాబయ్య అని సంబోధించేవాణ్ని. కాటూరివారూ నండూరివారూ నాకు మావయ్యలు! మా ఇంట్లో రోజూ సందడే. ఒక రోజు నాటకం, ఒక రోజు కవిసమ్మేళనం, ఒక రోజు గాత్ర కచేరీ. అదో కళల కూడలి. ఎంతపెద్ద సభలో పాల్గొన్నా ఎంత ఉద్వేగంతో ఉపన్యసిస్తున్నా...నాన్న మనసెప్పుడూ నా మీదే. వెుదటి వరుసలో నేనుండాల్సిందే. ఓసారి విశాఖపట్నంలో బ్రహ్మాండమైన సభ జరిగింది. మాటలు, పాటలు, కవిత్వం, చలోక్తులు...సాహితీప్రియులకు అదో విందు! నాకు మాత్రం ఎందుకో ఆయన ఉపన్యాసం ఆపరేవో అన్న భయంపట్టుకుంది. 'ఇక ఆపు...' అని గట్టిగా అరిచాను. 'నా ఉపన్యాసం ఆపేస్తున్నాను. మా అబ్బాయి ఆపెయ్యమంటున్నాడు' అని చెప్పేశారు. జనం వింటేగా! ఆయన ఉపన్యాసం ఆపకుండా ఉండటానికి ఎవరో నన్ను బయటికి తీసుకెళ్లి బిస్కెట్లూ గట్రా ఇప్పించారు. అప్పట్నుంచి ఆ వ్యక్తిని 'శీనూ శీనూ' అని పిలిచేవాణ్ని. ఆయన పేరు శ్రీశ్రీ. ఏంచేయమంటారు, నోరుతిరిగేది కాదు. ఓసారి ఇలానే నేను ఉపన్యాసాన్ని అడ్డుకున్నప్పుడు విశ్వనాథవారికి కోపం వచ్చింది. నాన్నగారికి మాత్రం నా మీద ఎప్పుడూ కోపం రాలేదు. నాకూ ఓ వ్యాపకం ఉండాలి కాబట్టి, ఎక్కడికి వెళ్తున్నా ఓ డ్రాయింగ్‌బుక్కు, పెన్సిలు కొనిచ్చేవారు. నేను రైలింజను బొమ్మలేస్తూ కూర్చునేవాణ్ని. ఆయనేవో ఉపన్యాసాల్లో లీనమయ్యేవారు. అలా మా ఇద్దరి సమస్యలూ పరిష్కారం అయ్యాయి. ఆ సాధనే నన్ను చిత్రకారుడిని చేసింది. అడివి బాపిరాజుగారు ఒళ్లో కూర్చోబెట్టుకుని రేఖాభ్యాసం చేయించారు. వల్లూరి జగన్నాథరావు అనే వాగ్గేయకారుడు నేలమీద సుద్దముక్కతో బొమ్మలు వేయడం నేర్పించారు.
నా బొమ్మలు అద్భుతంగా ఉన్నాయని వెుట్టవెుదట మెచ్చుకున్న వ్యక్తి మా బావ...వింజమూరి ప్రభాకరం. నేను ఏం గీసినా ప్రోత్సహించేవారు. నాకు పదిహేనేళ్లు వచ్చేసరికి మా మకాం మద్రాసుకు మారింది. బీఎన్‌రెడ్డిగారు పట్టుపట్టి పిలిపించారు. నాన్నగారి జీవితంలో అదో మలుపు. నా జీవితంలో కూడా. ఆయన రోజూ నన్ను వాహినీ ఆఫీసుకు తీసుకెళ్లేవారు. పెద్దలంతా కథా చర్చలు జరుపుతూ ఉంటే, నేను దిక్కులు చూస్తూ కూర్చునేవాణ్ని. 'పాపం రోజూ ఆ కుర్రాణ్ని వెంటపెట్టుకుని వస్తావు. స్కూలూ గీలూ లేదా వాడికి'...ఎవరో నాన్నగారికి కాస్త గట్టిగానే చెబుతున్నారు. అది బీఎన్‌రెడ్డిగారి తమ్ముడు కొండారెడ్డి స్వరం. నాకు బాధనిపించింది. చాలా కోపం వచ్చింది కూడా. ఆలోచిస్తే...ఆ మాటల్లో నిజం ఉన్నట్టు తోచింది. ఇక నాన్నగారితో ఎక్కడికీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. బొమ్మల మీదే దృష్టిసారించాను. ఆరోజుల్లోనే ఓసారి, 'ఫ్రీ ఇండియా' అనే వారపత్రిక చూశాను. చివరిపేజీలో 'టార్జాన్‌ కామిక్‌స్ట్రిప్‌' ఇచ్చేవారు. దాన్ని చూస్తుంటే సినిమా చూసిన అనుభూతి కలిగేది. శుక్రవారం పత్రిక మార్కెట్‌లోకి వచ్చేసరికి, మూడణాలు సిద్ధంగా ఉంచుకునేవాణ్ని. అప్పటికీ నాకు చదవడం రాదు. మా పెద్ద మేనమామ బాబాజీ చదివి చెప్పేవాడు. అలాంటి బొమ్మలు ఎందుకు ప్రయత్నించకూడదన్న ఆలోచన వచ్చింది. వాడూ సరేనన్నాడు. ఇద్దరం కలసి కౌబాయ్‌తరహా కథ సిద్ధంచేశాం. మద్రాసు జీవితం నాకు ఇంగ్లీషు సినిమాల్ని పరిచయం చేసింది. నాతోపాటు బుల్లిసీత కూడా వచ్చేది. నేనూ బాబాజీ 'కాసినో థియటర్‌' దాకా వెళ్లి సినిమా పోస్టర్లు చూసేవాళ్లం. అలా కూడబలుక్కుని చదవడం వచ్చేసింది. ఇంగ్లీషు అర్థంచేసుకోవడం, ఓ వోస్తరుగా మాట్లాడటం అలవాటైంది. పెరల్స్‌ బక్‌, అగాధా క్రిస్టీ, సోమర్సెట్‌ మామ్‌... తదితరుల నవలలు చాలా చదివాను. అదంతా తలుచుకుంటే నాకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. కిరాణాకొట్టు నడుపుతున్న ఓ మిత్రుడు పుస్తకం వేద్దామంటే, 'బానిసపిల్ల' పేరుతో 30 పేజీల కథ సిద్ధం చేశాను. దానికి మంచి పేరు వచ్చింది. హిందూలో బాగా రాశారు. ఆతర్వాత 'మేజిక్‌ గార్డెన్‌', 'ఆంధ్రప్రభ', 'దినమణి కదిర్‌' తదితర పత్రికల్లో నా బొమ్మల కథలొచ్చాయి. దాంతోపాటూ గుర్తింపు కూడా వచ్చింది. మా వీధిలోని తమిళులు 'పుచ్చాయి...పుచ్చాయి' అని చెప్పుకుంటూ ఉంటే, కించిత్‌ గర్వంగా అనిపించేది. కృష్ణశాస్త్రిగారి అబ్బాయిగా కాకుండా, నాకంటూ కొంత గుర్తింపు వచ్చిందన్న ఆనందమది. చిత్రకారుడిగా నాదైన ప్రత్యేకశైలి ఉండవచ్చు కానీ, నా ఆలోచనల మీదా భావాల మీదా నాన్నగారి ప్రభావం ఒక జీవితకాలానికి సరిపడా ఉంది. నాన్నగారికి ఆలిండియా రేడియోలో ఉద్యోగం రావడంతో మళ్లీ హైదరాబాద్‌ వచ్చేశాం. ఓసారి కాటూరి వారితో కలిసి భోగరాజు పట్టాభిసీతారామయ్యగారి ఇంటికెళ్లాను. 'కృష్ణశాస్త్రిగారి అబ్బాయి' అని నన్ను పరిచయం చేశారు. 'ఏం చదివాడు? ఎంత గడిస్తున్నాడు?' అనడిగారాయన. 'డిగ్రీలేదు. స్కూలూ కాలేజీకి వెళ్లలేదు. సంపాదన నాలుగైదువందల దాకా ఉంటుంది' అని చెప్పారు. ఇంతలో ఎవరికో 'సముద్రంలో ఓడమీద ప్లేన్లు ఉంటాయి కదా. వాటినేమంటారు?' అన్న సందేహం కలిగింది. 'ఎయిర్‌క్రాఫ్ట్‌ కారియర్‌ అండీ' అని చెప్పాన్నేను. ఆయనకు ఆశ్చర్యం! 'అదీ అలాగుండాలి. డిగ్రీలు ఎందుకయ్యా' అని మెచ్చుకున్నారు. ఆతర్వాత తన మనవరాల్ని ఇచ్చి పెళ్లిచేశారు. మా ఆవిడ పేరు లక్ష్మి. మాకు ఇద్దరు అమ్మాయిలు...రేవతి, రేఖ. నా కొడుకు కృష్ణశాస్త్రి. తను కూడా నాలాగే ఆర్టిస్ట్‌.
నాన్నగారి వయసు పెరుగుతోంది. దాంతోపాటే అనారోగ్యమూ. డాక్టరు సలహా మీద చుట్టకాల్చడం కూడా మానేశారు. అయినా ఏవో సమస్యలు. కొన్నిసార్లు ఊపిరి ఆడేది కాదు, ఆయాసం. ఎందుకైనా మంచిదని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం. ఏవో పరీక్షలు చేయించారు. కేన్సర్‌ అని తేలింది. 'ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకో రెండుమూడు నెలలు...' డాక్టరు మాట పూర్తికాకముందే మా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ విషయం నాన్నగారికి చెప్పకూడదని అనుకున్నాను. మంచి నిపుణులు ఉన్నారని తెలిసి, బొంబాయి తీసుకెళ్లాం. అక్కడా కొన్ని పరీక్షలు చేసి, శస్త్రచికిత్స తప్పదని చెప్పారు. స్వరపేటిక తీసేస్తారు. ఆ మహావక్త ఇక మాట్లాడలేరు. కంఠానికి ఓ రంధ్రం పెడతారు. అందులోంచే ఊపిరి పీల్చుకోవాలి. వాసనలు తెలియవు. మంచిగంధం, మల్లెపూలూ ఆస్వాదించలేరు. ఇవన్నీ చెబితే, ఆయన తట్టుకుంటారా? అయినా తప్పలేదు. సర్జరీ జరిగింది, మాట పోయింది. స్పీచ్‌ థెరపీతో పరిస్థితి కొంత మెరుగుపడుతుందని చెప్పారు. కానీ అది నాన్నగారికి నచ్చలేదు. చిన్న పుస్తకాల మీద రాయడమే హాయిగా అనిపించేది. అప్పుడు మాట్లాడేవారు. ఇప్పుడు రాస్తున్నారు. అంతే తేడా. దాదాపు పదహారేళ్లు ఆయన జీవితం నిశ్శబ్దంగానే సాగింది. ఆ అనారోగ్యం ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయింది. సాహితీ సృజన మీద ఎలాంటి ప్రభావమూ లేదు. ఆ సమయంలో అద్భుతమైన పాటలు రాశారు.
1980 ఫిబ్రవరి 24న...ఉదయం కొంచెం ఆయాసంగా ఉన్నట్టు కనిపించారు. డాక్టర్‌ రామ్‌దాస్‌గారిని తీసుకొచ్చాను. హార్ట్‌ స్పెషలిస్టుకు చూపించమన్నారు. ఆరోజు ఆదివారం కావటంతో నిపుణులు అందుబాటులో లేరు. మరుసటి రోజు వచ్చి చూస్తామన్నారు. రాత్రికి ఆయాసం ఎక్కువైంది. భయమేసి అంబులెన్సు పిలిపించాం. అంతలోనే, అంతా అయిపోయింది. ఇంతకాలం వేలుపట్టుకుని నడిపించిన నాన్న ఇక లేరని తెలిసి తట్టుకోలేకపోయాను. అయినా, ఆయనకు మరణం ఏమిటి? వెన్నెలరాజు, కలుములరాణి, గోరువంకలు, గోరింట పొదలు... ఉన్నంతకాలం కృష్ణశాస్త్రి ఉంటారు.
మానాన్న చిరంజీవి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)