సమాజ హితమే లక్ష్యం! అవార్డులే సాక్ష్యం! (Eenadu etaram 26/05/2012)


సమాజ హితమే లక్ష్యం! అవార్డులే సాక్ష్యం!
సమయం దొరికితే సరదాల ఒడిలోకి జారుకోవడం... కాలేజీ కుర్రకారుకు సాధారణం... దీనికి భిన్నంగా... సమాజానికి ఉపయోగపడుతోందో విద్యార్థి బృందం... ఉద్యోగం రాగానే సొంతానికి ఆలోచించడం సహజం... అందుకు భిన్నంగా సమాజ హితానికి ప్రయోగాలు చేశాడో యువకుడు... వీరి సదాశయం, సమాజ కాంక్ష వూరికే పోలేదు. అంతర్జాతీయ అవార్డులందాయి! ఆ విజయగాథని 'ఈతరం'తో పంచుకున్నారిలా...
పచ్చదనానికి వూతం!
అంతర్జాతీయ పోటీ. బరిలో యాభై ఒక్క దేశాలు. మూడు వందల విశ్వవిద్యాలయాలు. నెలలో ఎవరు ఎక్కువ పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడితే వాళ్లే విజేతలు. కలసికట్టుగా అడుగేశారు పెరంబదూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు.విజయలక్ష్మి వరించింది. అంతర్జాతీయ అవార్డు అందింది.
'ఎర్త్‌ డే నెట్‌వర్క్‌' అమెరికా సంస్థ. పర్యావరణ పరిరక్షణే ధ్యేయం. ధరిత్రి దినోత్సవం సందర్భంగా కాలేజీ విద్యార్థులకు 'మొబిలైజ్‌ యు' పేరిట పోటీ నిర్వహించింది. ఈ విషయం శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి రమేష్‌ రాజేష్‌కి తెలిసింది. వెంటనే కళాశాలలోని ఎకో ఫోరం, కేర్‌ క్లబ్‌, సహచర విద్యార్థులు, అధ్యాపకులకు చెప్పాడు. అందరూ సమావేశమై 'మొబిలైజ్‌ యు' కోసం ఏం చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బృందాల వారీగా విడిపోయి ప్రణాళికలు రూపొందించుకున్నారు.ఇందుకోసం ఇరవై రకాల కార్యక్రమాలు చేశారు. అంతరించిపోతున్న పిచ్చుకల్ని లెక్కించారు. కాలేజీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా చేసి మొక్కలు నాటారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. తాబేళ్ల రక్షణ, పక్షులకు నీరందించడం, అవగాహన సదస్సులు ఇలాంటివెన్నో. దీంతోపాటే తీవ్ర విద్యుత్తు సమస్యతో సతమతమవుతున్న తెన్నాలూర్‌, శివన్‌తాంగల్‌ గ్రామాల్ని దత్తత తీసుకొని ఉచితంగా సౌర దీపాలు అందించారు. అవసరమైన డబ్బుని చెన్నైలోని వస్త్ర దుకాణాల నుంచి విరాళంగా సేకరించారు. వివరాల్ని ఎర్త్‌ డే నెట్‌వర్క్‌ సంస్థకి వారానికోసారి ఆన్‌లైన్‌లో పంపించారు. సంబంధిత ఫొటోల్ని ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. వీటి ఆధారంగానే సంస్థ పాయింట్లు కేటాయించేది. ఉదాహరణకు ఐదుగురు విద్యార్థుల బృందం ఒక్కొక్కరు రెండేసి మొక్కలు నాటితే 5X2=10 పాయింట్లు. మొదటి, రెండోవారం ముగిసే నాటికి బృందం 14, 12 స్థానాల్లో నిలిచింది. వెంటనే కార్యక్రమాల వేగం పెంచారు. మూడో వారానికి 5వ స్థానానికి, చివరి వారానికి అగ్రస్థానానికి చేరుకున్నారు. పోటీ పూర్తయ్యేనాటికి 300 విశ్వవిద్యాలయాల్ని వెనక్కినెట్టి 89230 పాయింట్లతో విజేతగా నిలిచారు. అవార్డు అందుకోగానే బాధ్యత తీరిపోయిందనుకోలేదు విద్యార్థి బృందం. రెండేళ్లలో కాలేజీని ప్లాస్టిక్‌, వ్యర్థరహిత కాలేజీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్ని దత్తత తీసుకుని సౌర విద్యుద్దీపాల ఏర్పాటు, వాననీటి నిల్వ, చెత్తతో ఎరువు తయారీ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
- రుద్రరాజు సుభాష్‌, న్యూస్‌టుడే: తమిళనాడు డెస్క్‌
పరిశోధనకు పట్టం!
వైద్య ఖర్చుల కారణంగా రోడ్డున పడుతున్న కుటుంబాలు మన దేశంలో కోకొల్లలు. దీనికి విరుగుడుగా ఏం చేయవచ్చో ప్రయోగాత్మకంగా నిరూపించాడు వరంగల్‌ యువకుడు ఉదయ్‌వెంకట్‌ మాటేటి.అతడి పరిశోధనకి ప్రతిష్ఠాత్మక 'ఇస్పార్‌' సంస్థ ఇచ్చే అవార్డు దక్కింది. దీనికోసం వెంకట్‌ ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వేలమందితో పోటీ పడ్డాడు.దయ్‌ సొంతూరు వరంగల్‌ జిల్లాలోని దంతాలపల్లి. ప్రస్తుతం వరంగల్‌లోని సెయింట్‌ పీటర్‌ ఫార్మాసూటికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. పుట్టి పెరిగినదంతా పల్లెలోనే. సహజంగానే గ్రామీణుల కష్టసుఖాలపై అవగాహన ఉంది. ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చుల కారణంగా ఆస్తుల్ని తెగనమ్ముకున్న కుటుంబాల్ని కళ్లారా చూశాడు. ఈ సమస్యకి పరిష్కారం చూపాలనే ఆలోచన చిన్నప్పుడే మొదలైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇండియాలో మధుమేహ రోగుల సంఖ్య 4 కోట్లు దాటింది. అందుకే దానిపైనే పరిశోధనకు శ్రీకారం చుట్టాడు. ముందు డయాబెటిక్స్‌, మానసిక ఒత్తిళ్లు, గుండెజబ్బులతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 170 మంది రోగుల్ని ఎంపిక చేసుకున్నాడు. రెండునెలలు వాళ్లు వాడుతున్న మందులు, ఖర్చు వివరాలు సేకరించాడు. అప్పుడప్పుడు ఆసుపత్రికొచ్చి వైద్యం చేయించుకుంటున్న వాళ్లకి నెలకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చైతే, ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్న వాళ్ల ఖర్చు రూ. 6 వేల నుంచి రూ.8 వేలని తేలింది.
ర్చులు తగ్గించడమే ఉదయ్‌ లక్ష్యం. నేరుగా వైద్యుల దగ్గరికెళ్లి ఖరీదైన మందుల స్థానంలో తక్కువ ధర మందులు రాయమని కోరాడు. ధర తక్కువైనా బాగా పనిచేసే మందులేవో వైద్య పుస్తకాలు తిరగేసి మరీ చూపించాడు. రోగులకూ అదే సలహా ఇచ్చాడు. ముందు సంకోచించినా వైద్యులు, రోగులు తర్వాత ఓకే అన్నారు. చెప్పిన మందులే వాడేలా రోజూ రోగులకి కౌన్సెలింగ్‌ ఇచ్చేవాడు. మార్చుకోవాల్సిన ఆహారపు అలవాట్లు సూచించాడు. నడక, చిన్నపాటి వ్యాయామం, యోగా క్రమం తప్పకుండా చేయించేవాడు. మందుల ఖర్చు నెలకి పదిశాతం చొప్పున నాలుగు నెలల్లో నలభై శాతం తగ్గింది.
 పరిశోధన వివరాల్ని ఉదయ్‌ ప్రతిష్ఠాత్మకISPOR(ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ ఫార్మాకోఎకనమిక్స్‌ అండ్‌ ఔట్‌కమ్స్‌ రీసెర్చ్‌)కి పంపాడు. వైద్య రంగంలో మేలిమి మార్పుల కోసం పనిచేసే సంస్థ ఇస్పార్‌. ఇలా ఉత్తమ పరిశోధనలు చేసిన వైద్యులకి ఏటా అవార్డులిస్తుంటుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల ప్రతిపాదనలందాయి. అందులో తొమ్మిది ప్రతిపాదనలకు అవార్డులు ప్రకటించారు. వీటిలో ఉదయ్‌ది ఒకటి. అవార్డుతోపాటు విజేతలకు వైద్యరంగంలో మరింత పరిజ్ఞానం సంపాదించేలా నాలుగు కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తుంది సంస్థ. జూన్‌ మొదటివారంలో ఈ అవార్డు అందుకోబోతున్నాడు ఉదయ్‌.
- హిదాయతుల్లా బిజాపూర్‌, న్యూస్‌టుడే: హన్మకొండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

'వెబ్‌' దునియా... దున్నేస్తున్నారు! (Eenadu Sunday_10/07/2013)

వైవిధ్యమే జీవం! (Eenadu Sunday_30/09/12)